YS Sharmila: బోడి 25 వేలకు మూడో బిడ్డను కనాలా ? చంద్రబాబుపై షర్మిల పంచ్..!
ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రతిపాదిస్తున్న మూడు బిడ్డల విధానంపై పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila)ఇవాళ తనదైన శైలిలో పంచ్ లు వేశారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా మూడు బిడ్డల్ని కంటే వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేదెవరని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికే ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్దిదారులకు అన్నీ బకాయిలే పెడుతోందని, ఇప్పుడు అదనంగా బిడ్డల్ని కంటే వారికీ బకాయిలు పెడతారా అని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు.
అసలు మన రాష్టం ఎంత దయనీయమైన స్దితిలో ఉందో అర్దమవుతోందా అని సీఎం చంద్రబాబును పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలకు అన్నింటికీ రాజధానులు ఉన్నాయని, ఏపీకి కనీసం రాజధాని కూడా లేదని విమర్శించారు.
మనకేం ఉంది చేతిలో చిప్ప తప్ప అన్నారు. మన బిడ్డల భవిష్యత్తు ఏం కావాలని షర్మిల ప్రశ్నించారు. డిగ్రీలు, పీజీలు చేసిన బిడ్డలంతా రోడ్లపై తిరుగుతున్నారని, ఆటో డ్రైవర్లుగా, గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

పైగా సీఎం చంద్రబాబు ఇప్పుడు ముగ్గురు, నలుగురు, ఐదుగురు బిడ్డల్ని కనాలంటున్నారని షర్మిల విమర్శించారు. అలా కన్న వారికి ఆయన 25 వేలు ఇస్తానంటున్నారని, బోడి మీరిచ్చే పాతిక వేలకు మీరు బిడ్డల్ని కనాలా అని ప్రజల్ని షర్మిల ప్రశ్నించారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి చంద్రబాబు 3 వేల కోట్లు బకాయిలు పెట్టారని, ఫీజు రీయింబర్స్ మెంట్ కు 6 వేల కోట్లు బకాయిలు పెట్టారన్నారు. కరెంటు ఛార్జీలు సైతం 17 వేల కోట్లు పెంచారన్నారు. ఇది సరిపోదని ఇప్పుడు మూడు బిడ్డల్ని కనాలని అంటున్నారని ఆక్షేపించారు. దీన్ని బట్టి పాలకులు ఎలా ఉన్నారో అర్దం చేసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications