ఏపీ డీజీపీపైనా త్వరలో ఈసీ వేటు ? తెరపైకి ఆ సీనియర్ ఐపీఎస్..!
ఏపీలో ఒకే రోజు ఏకంగా ఓ ఐజీ, ఐదుగురు జిల్లా ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లపై బదిలీ వేటు వేసిన ఈసీ సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో గతంలో జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ ఇంత భారీ స్ధాయిలో అఖిల భారత సర్వీసు అధికారులు ఎన్నికల సందర్భంగా బదిలీ వేటు ఎదుర్కోలేదు. దీంతో ఇప్పుడు ఈసీ తదుపరి చర్యలేంటన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని సైతం బదిలీ చేసేందుకు ఈసీ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రాకముందు నుంచే అధికార పార్టీకి మద్దతుగా ఉంటూ విపక్షాలను టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐజీ పాలరాజు, ఐదు జిల్లాల ఎస్పీలు పరమేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, తిరుమలేశ్వర్ రెడ్డి, జాషువా, అన్బురాజన్ లపై ఈసీ ఏకకాలంలో వేటు వేసింది. ఇందులో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న వైఫల్యంతో పాటు వివిధ జిల్లాల్లో విపక్షాలను టార్గెట్ చేస్తున్న ఆరోపణలను వీరు ఎదుర్కొన్నారు. దీంతో ఈసీ వీరిని పూర్తిగా ఎన్నికలకు దూరంగా ఉంచేసింది.

ఇప్పుడు ఇదే క్రమంలో రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపైనా బదిలీ వేటు పడొచ్చని సమాచారం. ఇప్పటికే ఈసీకి డీజీపీ తీరుపై విపక్షాలు వరుస ఫిర్యాదులు చేస్తున్నాయి. అయితే సీనియారిటీ లేకపోయినా సీఎం జగన్ ఏరికోరి తెచ్చి పెట్టుకున్న డీజీపీ ఇప్పుడు ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారనే కచ్చితంగా భావిస్తే ఈ వారంలోనే వేటు పడొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు పడిన నేపథ్యంలో వీరిని పర్యవేక్షిస్తున్న డీజీపీపైనా కచ్చితంగా వేటు పడుతుందని విపక్షాలు అంచనా వేస్తున్నాయి.
మరోవైపు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై వేటు వేయాల్సి వస్తే సీనియార్టీ జాబితాలో ముందున్న ప్రస్తుత ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఈవో నుంచి వెళ్లే నివేదిక ఆధారంగా ఈ నియామకం జరగవచ్చని చెబుతున్నారు. గతంలో ద్వారకా తిరుమలరావుతో పాటు పలువురు ఐపీఎస్ లు సీనియారిటీలో ముందున్నా వారిని కాదని కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని సీఎం జగన్ డీజీపీగా నియమించారు.












Click it and Unblock the Notifications