ముందస్తుపై జగన్ మనసు మారిందా ? వర్క్ షాప్ లో క్లారిటీ ! ఢిల్లీ టూర్ ఎఫెక్ట్ ?
ఏపీలో ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికార వైసీపీ కేబినెట్ ప్రక్షాళనతో మొదలుపెట్టిన హంగామా ఇంకా కొనసాగుతోంది. దీంతో ప్రతిపక్షాలు కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమైపోతున్నాయి. తాజాగా గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంపై వైసీపీ నిర్వహించిన వర్క్ షాప్ లో సీఎం జగన్ దీనిపై ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. దీంతో విపక్షాలు కూడా దీనిపై ఆలోచనలో పడుతున్నాయి.

ఏపీలో ముందస్తు కూత
ఏపీలో కొంతకాలంగా ముందస్తు ఎన్నికలల రాగాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ సర్కార్ మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సీఎం జగన్ చేపట్టిన కేబినెట్ ప్రక్షాళన దీనికి ఊతానిచ్చింది. కేబినెట్ ప్రక్షాళన ద్వారా తన ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని తగ్గించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని అంతా భావించారు. అలాగే గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం చేపట్టడం ద్వారా త్వరలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీనికి కేంద్రం నుంచి అనుమతి లభించడమే తరువాయి అన్న వాదన కూడా వినిపించింది. దీంతో విపక్షాలు కూడా తమవంతుగా రాజకీయాల్ని రగిల్చే పనిలో పడ్డాయి.

జగన్ మనసు మారిందా ?
కానీ తాజాగా ముందస్తు ఎన్నికలకు సంబంధించి జగన్ మనసు మారినట్లే కనిపిస్తోంది. ఇంతకు ముందు ఏ బహిరంగసభకు వెళ్లినా, ఎక్కడ మాట్లాడినా చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల వాతావరణం రగిల్చేందుకు ప్రయత్నించిన సీఎం జగన్.. కొన్నిరోజులుగా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. అలాగే నిన్న జరిగిన వైసీపీ గడప గడపకూ ప్రభుత్వం వర్క్ షాప్ లోనూ ఎమ్మెల్యేలకు జగన్ ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని సూచించారు. అలాగే వారికి లాంగ్ టర్మ్ ప్లాన్ కూడా ఇచ్చేశారు. దీంతో ముందస్తు ఎన్నికల ఆలోచనను జగన్ విరమించుకున్నారన్న చర్చ సాగుతోంది.

ఢిల్లీ టూర్ తర్వాత యూటర్న్ ?
తాజాగా సీఎం జగన్ ఢిల్లీ టూర్ కు వెళ్లి వచ్చారు. అక్కడ ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ అయ్యాగు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ముందస్తు ఎన్నికలపైనా చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీ పెద్దలు ముందస్తు ఎన్నికలపై అంతగా ఆసక్తి చూపలేదని తెలుస్ోతంది. భారీ మెజారిటీతో ఉన్న వైసీపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడం సరైన నిర్ణయం కాదని వారించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జగన్ కూడా వెనక్కి తగ్గి ఉంటారనే వాదన వినిపిస్తోంది.

ముందస్తు లేదనేలా జగన్ సంకేతాలు ?
ముందస్తు ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో నిన్న తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన గడప గడపకూ ప్రభుత్వం వర్క్ షాప్ లో సీఎం జగన్.. ముందస్తు ఎన్నికలకు సంబంథించి పరోక్ష సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే 8 నెలల పాటు గడప గడపకూ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు జగన్ సూచించారు. అలాగే వచ్చే ఆరునెలల పాటు ఎమ్మెల్యేల పనితీరు పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. దీంతో కనీసం వచ్చే 8 నెలల పాటు ఎన్నికల గురించి చర్చ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత ఎలాగో ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టడం ఖాయం. అ తర్వాత జరిగే ఎన్నికలు సాధారణ ఎన్నికలే అవుతాయి తప్ప ఎలాంటి ముందస్తు చర్చలూ ఉండవు.












Click it and Unblock the Notifications