ఘన చరిత్ర: రాజధాని శంకుస్థాపన జరిగే ఉద్దండరాయని పాలెంపై స్పెషల్ ఫోకస్
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు కార్యక్రమానికి ఇంక కొన్ని గంటలే ఉండటంతో ఏర్పాట్లన్నీ చకాచకా జరిగిపోతున్నాయి. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్న ఉద్దండరాయుని పాలెంకు చరిత్రలో ఓ ప్రత్యేక స్ధానం ఉంది.
అంతేకాదు రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాల పేర్లన్నీ దాదాపు శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చినవే. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోన్న రాజధాని శంకుస్ధాపన కార్యక్రమం జరిగే ఉద్దండరాయుని పాలెం చరిత్ర తెలుసుకుందాం.
విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల రాయల వారి కొలువులో ఉద్దండరాయుడు గొప్ప సేనాని. అంతేకాదు శ్రీకృష్ణదేవరాయలకు అత్యంత ప్రీతిపాత్రుడు. శ్రీకృష్ణదేవరాయల వారి సామ్రాజ్య విస్తరణలో ఉద్దండరాయుడు కీలకపాత్ర పోషించాడు.
యుద్ధ విషయాల్లో ఆరితేరినవాడు. ఆంధ్రుల రాజధాని అమరావతికి శంకుస్థాపన జరగబోతున్న ఉద్దండరాయునిపాలెం ఆయన పేరు మీద ఏర్పడిన గ్రామం కావడమే విశేషం. సామ్రాజ్య విస్తరణకు శ్రీకృష్ణదేవరాయలు విజయనగరం నుంచి బయలుదేరారు. మార్గమధ్యలో స్థానిక సంస్థానాలను, చిన్న, చిన్న రాజ్యాలను స్వాధీనం చేసుకుంటూ గోదావరి నదిని దాటుకుని తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టారు.
అక్కడున్న నేలకొండపల్లికి చేరుకున్నారు. ఆరంభంలోనే అక్కడి గజపతి రాజుపై యుద్ధం ప్రకటించారు. కుమారుడు, భార్య మరణించి ఉండటంతో అప్పటికే గజపతిరాజు నిర్వేదంలో ఉన్నాడు. యుద్ధం చేసే ఓపిక లేక రాయలకు లొంగిపోయాడు. ఆ తర్వాత గజపతుల అధీనంలో ఉన్న (గుంటూరు, కృష్ణా జిల్లాలు) ప్రాంతంపై రాయలు దృష్టిసారించారు.
తొలుత కృష్ణా నది మీదుగా ప్రస్తుత గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. గజపతుల అధీనంలో ఉన్న కొండవీడు కోటపై మెరుపు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కొండపల్లి ఖిల్లాపై కన్నేశారు. ఆ రోజుల్లో రోడ్లు లేవు. వంతెనలు లేవు. నది సన్నగా, వెడల్పు తక్కువగానే ఉన్నా.. దీనిని దాటి ప్రస్తుత కృష్ణా జిల్లాలోకి ప్రవేశించటానికి రాయలకు చాలా సమయమే పట్టింది.
అయినా సరే, పట్టు వదలని విక్రమార్కుడిలా కృష్ణా నదిని దాటి కొండపల్లి దుర్గంపై దాడికి ప్రయత్నించారు. ఆ సమయంలో భారీ వర్షాలు కురవటంతో శ్రీ కృష్ణదేవరాయల ప్రయత్నం ఫలించలేదు. దీంతో, యుద్ధాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుని నదిని అతి కష్టంమీద దాటుకుంటూ తిరిగి వెనకకు తిరిగి వెళ్లారు.
ఈ నేపథ్యంలో, కొండపల్లి వెళ్లడానికి ముందు, యుద్ధ విరామ సమయంలో, తర్వాత అంతా శ్రీకృష్ణదేవరాయలు బస చేసిన ప్రాంతమే కాలక్రమంలో రాయపూడి అయింది. కృష్ణా తీరంలోని ఈ రాజధాని గ్రామంలోనే ఇప్పుడు పరిపాలనా భవనాలు రాబోతున్నాయి. రాయల సేనాని ఉద్దండరాయుడు బస చేసిన ప్రాంతమే ఉద్దండరాయునిపాలెంగా మారింది.
రాయల వారు తులు వంశస్థులు అవడంతో అక్కడ ఉన్న ప్రధాన పట్టణానికే తులూరుగా నామకరణం చేశారు. ఇప్పుడు అది తుళ్లూరుగా రూపాంతరం చెందింది. రాయలవారికి సామంతుడుగా ఉన్న అబ్బరాజు పేరిట అబ్బరాజుపాలెం.. మరో సామంతుడు వెంకటప్ప పేరిట వెంకటపాలెం అవతరించాయి.
(డా. బి.ఎస్.ఎల్.హనుమంతరావు ఆంధ్రుల చరిత్ర నుంచి)
అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో గుమ్మడి గోపాలకృష్ణ ప్రదర్శన
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం రోజైన అక్టోబర్ 22న అంతర్జాతీయ డ్రామా ఆర్టిస్ట్ గుమ్మడి గోపాలకృష్ణ ప్రదర్శన ఇవ్వనున్నారు. కృష్ణా జిల్లాలోని మేడూరు గ్రామానికి చెందిన గుమ్మడి గోపాల కృష్ణ తన ప్రదర్శనలతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అమెరికాలో సుమారు 200 మంది ఎన్నారై విద్యార్ధులకు స్టేజి షోలలో శిక్షణ ఇచ్చారు. శ్రీకృష్ణ అవతారం, శ్రీ రాముడు, యేసు క్రీస్తు, నారద అవతారాల్లో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు.