పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..!
ఏపీలో రాజధానిగా అమరావతిని (Amaravati) ఖరారు చేస్తూ పార్లమెంట్ లో రాష్ట్ర పునర్ విభజన చట్టాన్ని సవరించేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఇందుకోసం ఏపీ అసెంబ్లీ అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం కూడా పంపింది. దీని ఆధారంగా విభజన చట్టంలో సవరణలు చేస్తూ ప్రతిపాదిస్తున్న బిల్లును బుధవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి అధికార, విపక్షాల మధ్య రాజకీయ వేడి రగులుకుంటోంది.
పార్లమెంట్ లో రాజధాని బిల్లును కేంద్రం తెస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఆ మేరకు హడావిడి చేసేందుకు టీడీపీ ప్లాన్ చేస్తోంది. కూటమి పార్టీలతో కలిసి గతంలో జగన్ చేసిన మూడు రాజధానుల ప్రయత్నాల్ని ఎండగట్టేలా టీడీపీ నేతలకు టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు కీలక సూచనలు చేశారు. దీంతో రేపు రాష్ట్ర స్ధాయిలోనూ, జిల్లాలు, మండలాల స్ధాయిలోనూ రాజధాని అమరావతికి మద్దతుగా కూటమి పార్టీలు పలు కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. పార్లమెంట్ లో రాజధాని బిల్లు ఆమోదానికి ముందే అమరావతికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మద్దతు కూడగట్టడమే దీని వెనుక ఉన్న వ్యూహం.

అయితే దీనికి విపక్ష వైసీపీ కౌంటర్ వ్యూహం సిద్దం చేసింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో అమరావతి విషయంలో తమ వైఖరిని కుండబద్దలు కొట్టడంతో పాటు చంద్రబాబు సర్కార్ చేస్తున్న తప్పుల్నీ ఎండగట్టేందుకు సిద్దమవుతున్నారు. గతంలో మూడు రాజధానులు తీసుకొచ్చిన అవసరాన్ని, ఇప్పుడు దాని స్ధానంలో అమరావతికే మద్దతునివ్వాలన్న నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ జగన్ స్వయంగా వివరణ ఇవ్వబోతున్నారు. పార్లమెంట్ లో అమరావతి బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలోనే జగన్ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.












Click it and Unblock the Notifications