ఆ వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎంపీలకు చంద్రబాబు నోటీసులివ్వాలి:అంబటి రాంబాబు
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై టీడీపీ చిత్తశుద్ధి ఏంటన్నది సీఎం రమేష్ దీక్షలో, ఢిల్లీలో టీడీపీ ఎంపీల వ్యాఖ్యలతో మరోసారి తేటతెల్లమైందని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. హైదరాబాద్ లో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Recommended Video
ఢిల్లీలో టిడిపి ఎంపీల వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుని చంద్రబాబు వారికి నోటీసులివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ సాక్షిగా టీడీపీ ఎంపీల నాటకాలు బయటపడ్డాయని, ఆ నేతల మాటలను అందరూ వీడియోల్లో చూశారని అన్నారు. ఆ వీడియోలు బయటకు రావడంతో మీడియాలో రాకుండా టీడీపీ నేతలు జాగ్రత్తపడ్డది నిజం కాదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
టీడీపీ ఎంపీలకు విభజన హామీలు నెరవేర్చాలనే చిత్తశుద్ది ఏమాత్రం లేదన్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ది ఉక్కుదీక్ష కాదు.. తుక్కు దీక్ష అని ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డే స్వయంగా చెప్పారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ప్రజలను నట్టేట ముంచే పనులను టీడీపీ ఎంపీలు ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అసలు చంద్రబాబుకు ధర్మపోరాట దీక్ష చేసే అర్హత లేదన్నారు.
ఎపికి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు చిత్తశుద్ధితో రాజీనామాలు చేశారన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు పోరాటం చేస్తుంటే టీడీపీ నేతలు అవహేళన చేశారు. టీడీపీ నేతలు రాజీనామాలు చేయరు కానీ, విచిత్రంగా దీక్షలు చేస్తారు. లాలుచీ రాజకీయాలు చేసే చంద్రబాబు దీక్షలతో ఒరిగేదేమీ ఉండదు. బీజేపీతో పోరాడుతున్నట్లుగా చంద్రబాబు నాటకాలాడుతున్నారు. చంద్రబాబు పోరాటాలన్నీ నాటకాలను ఏపీ ప్రజలు నమ్మొద్దని తన మనవి అన్నారు.
వైఎస్సార్సీపీని విమర్శించడానికే ఏరువాక కార్యక్రమాన్ని టీడీపీ వాడుకుందని అంబటి విమర్శించారు. చంద్రబాబు పాలనలో వ్యవసాయం వృద్ధి మైనస్లో ఉందని, వ్యవసాయంపై ఏపీ సీఎంకు ఏమాత్రం ప్రేమ లేదని మరోసారి రుజువైందన్నారు. కమీషన్ వచ్చే రంగాలపైనే చంద్రబాబు దృష్టిసారించారని ఆరోపించారు. వ్యవసాయంలో అభివృద్ధి సాధించామని సీఎం చంద్రబాబు తప్పుడు లెక్కలు చూపారని అంబటి ధ్వజమెత్తారు. అవసరానికి ఏ పార్టీతోనైనా కలిసిపోయే విశాల దృక్పథం ఉన్న నేత చంద్రబాబు అని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.