కేంద్రం నిర్ణయాన్ని ధిక్కరిస్తున్న జగన్ సర్కార్ ! - గవర్నర్ జోక్యం కోరిన బీజేపీ....
అవకాశం దొరికినప్పుడల్లా ఏపీలో జగన్ సర్కారును ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు ఈసారి మరో కొత్త అస్త్రాన్ని ఎంచుకున్నారు. కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదంటూ ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు... తాజాగా ఇందులో జోక్యం చేసుకోవాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం అమలు చేయకపోవడం కేంద్ర ఆదేశాల ధిక్కారమేనని ఇందులో గవర్నర్ కు బీజేపీ అధ్యక్షుడు కన్నా తెలిపారు.

కేంద్రం చారిత్రక నిర్ణయం-
2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు దేశంలో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల ఓట్లు గంపగుత్తగా కొల్లగొట్టేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ ఓ నిర్ణయం తీసుకుంది. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ఇప్పుడు ఉన్న 50 శాతం రిజర్వేషన్లకు తోడు మరో 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కులాల ఆధారంగా మాత్రమే రిజర్వేషన్లు అమలవుతుండగా... ఈసారి మాత్రం ఆర్ధిక స్ధితిగతుల ఆధారంగా రిజర్వేషన్ల అమలుకు కేంద్రం నిర్ణయించింది. దీని ప్రకారం రాష్ట్రాలు విద్య, ఉద్యోగాల్లో 50 శాతం తో పాటు మరో 10 శాతం సీట్లు, ఖాళీలు కేటాయించేలా రాజ్యాంగంలో సవరణలు కూడా చేసింది.

అమలు చేయని ఏపీ...
కేంద్రం ఈడబ్ల్యూఎస్ కోటా కింద ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లను రాష్ట్రాలు కూడా అమలు చేయాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కలగూరగంపగా ఉన్న రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ఈ కొత్త రిజర్వేషన్ల అమలుకు ముందుకు రాలేదు. ఇతర రాష్ట్రాల తరహాలోనే ఏపీ కూడా దీన్ని లైట్ తీసుకుంది. దీంతో తాజాగా జగన్ సర్కారును ఇరుకునపెట్టేందుకు ఇదో అవకాశంగా బీజేపీ భావిస్తోంది. రిజర్వేషన్ల వ్యవహారాన్ని కెలకడం ద్వారా జగన్ సర్కారును టార్గెట్ చేయాలని బీజేపీ భావిస్తోంది.

గవర్నర్ కు ఫిర్యాదు- జోక్యం చేసుకోవాలని...
ఏపీలో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం ప్రకటించిన 10 రిజర్వేషన్లను అమలు చేయించడం ద్వారా మైలేజ్ దక్కించుకోవాలని నిర్ణయించిన బీజేపీ... ఈ మేరకు రంగంలోకి దిగింది. ఇవాళ గవర్నర్ హరిచందన్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఓ లేఖ రాశారు. ఇందులో కేంద్రం ప్రకటించిన రిజర్వేషన్లను జగన్ సర్కారు ఉల్లంఘిస్తోందని గుర్తుచేశారు. తక్షణం గవర్నర్ జోక్యం చేసుకుని రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. కేంద్రం వరమిచ్చినా జగన్ సర్కారు క్షేత్రస్ధాయిలో వీటిని అమలు చేయకపోవడం ద్వారా ఆర్ధికంగా బలహీన వర్గాలకు నష్టం చేస్తోందని కన్నా ఈ లేఖలో తెలిపారు. దీంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications