ఇక ఏపీలో వడగాల్పులు, బోటు ప్రమాదాలు ప్రకృతి విపత్తులే...సర్కారు ఉత్తర్వులు
ఏపీలో ప్రకృతి విపత్తుల విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దీని ప్రకారం ఇకపై వడగాల్పులతో పాటు బోటు మునక ప్రమాదాలను కూడా ప్రకృతి విపత్తులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో వేసవిలో వడగాల్పులు, తరచుగా బోటు ప్రమాదాల కారణంగా జనం మృత్యువాత పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్ర విపత్తుల నివారణ నిధి, జాతీయ విపత్తుల నివారణ నిధి నిర్వహణలో పలు మార్పులు జరిగాయి. వీటి ప్రకారం ప్రకృతి విపత్తుల జాబితాలో లేని ప్రమాదాలకు వీటి సాయం అందడం లేదు. దీంతో బాధితులు, మృతుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో ప్రభుత్వం తాజాగా ప్రకృతి విపత్తుల జాబితాను సవరించింది. ఈ నిర్ణయంతో ఇకపై వడగాల్పులు, బోటు ప్రమాదాల్లోనూ బాధితులుగా ఉన్న వారికి, మృతుల కుటుంబాలకు ప్రకృతి విపత్తు సాయం అందించేందుకు వీలు పడుతుంది.
ఇప్పటికే ఏపీలో పిడుగులను ప్రకృతి విపత్తుల జాబితాలో చేర్చారు. దీంతో పాటు వడగాల్పులు, బోటు ప్రమాదాలను కూడా ఈ జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. వీటి ప్రకారం ఇకపై ఆయా విపత్తుల్లో మృత్యువాత పడిన వారికి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ కింద సాయం అందబోతోంది.