17సార్లు: జగన్ హెచ్చరిక, కల్సిన తలసాని, కావూరి ఫైర్
హైదరాబాద్: తన ప్రసంగానికి సోమవారం తెలుగుదేశం పార్టీ సభ్యులు అడ్డు తగిలారని, పదిహేడు సార్లు మైక్ కట్ చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మంగళవారం ఆరోపించారు. తాను మాట్లాడిన రెండున్నర గంటల్లో గంటా 6 నిమిషాల సేపు టీడీపీ సభ్యులు అడ్డుతగలారని ఆరోపించారు. అధికార పక్షం తీరు రాష్ట్రం తలదించుకునేలా ఉందన్నారు.
ప్రజల సమస్యలు మాట్లాడుతుంటే అధికార పార్టీ సభ్యులు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని, ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా అధికార పక్షానికే స్పీకర్ అవకాశం ఇస్తున్నారన్నారు. లైవ్ కవరేజ్లో అధికార టీడీపీ సభ్యులను మాత్రమే చూపిస్తున్నారన్నారు. తమ పార్టీ సభ్యులను ఏ మాత్రం చూపించడం లేదన్నారు.
స్పీకర్ ఇకపై కూడా పక్షపాత వైఖరిని కొనసాగిస్తే మాత్రం ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని హచ్చరించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుల సస్పెన్షన్ను వెంటనే ఉపసంహరిచుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పక్షం తీరు ఆత్మస్తుతి, పరనిందగా ఉందన్నారు. తాము ప్రజల తరఫునే పోరాడుతున్నామన్నారు. సభలో ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తే ఏమీ మిగలదన్నారు.
మరోవైపు, బడ్జెట్లో సభ్యులు ప్రసంగించేందుకు స్పీకర్ తగినంత సమయం కేటాయించారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విఫ్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. హైదరాబాదులో చీఫ్ విప్ మీడియాతో మాట్లాడారు. టీడీపీకి రెండున్నర గంటలు, బీజేపీ సభ్యులకు 30 నిమిషాలు కేటాయించారన్నారు. అలాగే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులకు కూడా తగినంత సమయ కేటాయించారన్నారు. ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారని, అందువల్లే స్పీకర్ సభ నియమాలకు అనుగుణంగా సస్పెండ్ చేశారన్నారు.
జగన్ను కలిసిన తలసాని, విష్ణుకుమార్
వైయస్ జగన్ను బీజేపీ సభ్యుడు పెన్మత్స విష్ణుకుమార్ రాజు కలిశారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. తమకు కేటాయించిన సమయంలో కొంత ప్రతిపక్ష నేతకు ఇవ్వాలని చెప్పారు. దీనిపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తాను ఏం మాట్లాడుతున్నది తనకు తెలుసునని చెప్పారు. మరోవైపు, తెలంగాణ టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా జగన్ను కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు.
టీడీపీపై కావూరి ఆగ్రహం
తెలుగుదేశం పార్టీ పైన బీజేపీ నేత కావూరి సాంబశివ రావు మండిపడ్డారట. టీడీపీ మిత్రపక్షమైనా సరే తాము అన్యాయాన్ని ఎదుర్కొంటామని కావూరి చెప్పినట్లుగా తెలుస్తోంది. తాము ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. 2019లో టీడీపీ కంటే బీజేపీయే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు. టీడీపీ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు.