జగన్ పై అనుచిత వ్యాఖ్యలు-ప్రివిలేజ్ కమిటీ సంచలనం-అచ్చెన్నాయుడు, రామనాయుడి మైక్ కట్
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పోరు ఇవాళ మరో మలుపు తిరిగింది. అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగిన దూషణల్లో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడిపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సభా హక్కుల కమిటీ స్పీకర్ కు సంచలన ప్రతిపాదనలు చేసింది. వీరిద్దరికీ ఈ అసెంబ్లీ గడువు ముగిసేలోపు మైక్ ఇవ్వరాదని సభా హక్కుల కమిటీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన అమలైతే ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా మూగవ్రతం చేయాల్సిందే.
అసెంబ్లీలో వైసీపీ వర్సెస్ టీడీపీ
ఏపీలో రెండేళ్ల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో వైసీపీ 151 సీట్లతో ఘన విజయం సాధించగా.. టీడీపీ మాత్రం 23 స్ధానాలకే పరిమితమైంది. అందులోనూ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపు మొగ్గారు. దీంతో టీడీపీ బలం 19కి పడిపోయింది.
అదే సమయంలో వైసీపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను మిగిలిన 19 మంది ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రభుత్వం వీరిని కూడా టార్గెట్ చేస్తోంది. ఇదే క్రమంలో చంద్రబాబు తర్వాత అసెంబ్లీలో వాయిస్ వినిపిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.
జగన్ పై అనుచిత వ్యాఖ్యలు
సీఎం జగన్ పై గత అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామనాయుడు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా సీఎం జగన్ ను వ్యక్తిగతంగా దూషించినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ ఫిర్యాదుల్ని స్పీకర్ తమ్మినేని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి పంపారు. వీటిపై విచారణ జరిపిన ప్రివిలేజ్ కమిటీ తాజాగా మరోమారు సమావేశమైంది. ఇందులో టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
అచ్చెన్నాయుడు, రామానాయుడిపై చర్యలు
సీఎం జగన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడిపై చర్యలు తీసుకునే విషయంలో అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీలో చర్చ జరిగింది. ఇందులో వైసీపీ ప్రతినిధులుగా ఉన్న సభ్యులు చర్యలు తీసుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.
టీడీపీ తరఫున సభ్యుడిగా ఉన్న రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాత్రం వీరిపై చర్యల్ని వ్యతిరేకించారు. ఎమ్మెల్యే రామానాయుడిని సీఎం జగన్ డ్రామా నాయుడు అన్న తర్వాతే ఆయన సీఎంపై ప్రతివ్యాఖ్యలు చేశారని ప్రివిలేజ్ కమిటీకి గుర్తు చేశారు. కావాలంటే అసెంబ్లీ రికార్డులు పరిశీలించుకోవాలని కోరారు.అయితే సత్యప్రసాద్ వాదనను మిగతా సభ్యులు వ్యతిరేకించారు.
అసెంబ్లీ ముగిసేవరకూ మైక్ కట్ కు సిఫార్సు
టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడు సీఎం జగన్ పై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ప్రివిలేజ్ కమిటీ నిర్ధారణకు రావడంతో ఈ అసెంబ్లీ గడువు ముగిసేవరకూ జరిగే సమావేశాల్లో వీరిద్దరికీ మైక్ కట్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రివిలేజ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.
తమ నిర్ణయాన్ని త్వరలో కమిటీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు పంపనుంది. ఆయన కూడా ఆమోదిస్తే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు మైక్ కట్ నిర్ణయం తర్వాతి అసెంబ్లీ సమావేశాల నుంచే అమల్లోకి రాబోతోంది. ఈ వ్యవహారంలో సీఎం జగన్ కూడా సీరియస్ గా ఉండటంతో మైక్ కట్ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.