వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే..తేల్చేసిన పురందేశ్వరి..!
ఏపీకి కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం త్వరలో ప్రైవేటీకరించనుందన్న వార్తలు కార్మికులు, ఉద్యోగుల్ని కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వారు విధులు బహిష్కరించి రోడ్లపైకి వస్తున్నారు. ప్లాంట్ పనిచేసేందుకు అవసరమైన ముడి సరుకు కొరత తీవ్రమవుతుండటం, మరోవైపు ఉద్యోగులను ప్రొబేషన్ పై ఇతర సంస్థలకు పంపడం చూస్తుంటే ప్రైవేటీకరణ తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఇవాళ రాజమండ్రిలో స్పందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ధ్వంసం చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదని ఆమె తేల్చిచెప్పారు. స్టీల్ ప్లాంట్ ని కాపాడాలనే ఆలోచనే కానీ, లాభాల్లోకి తీసుకురావాలనే ఆలోచనే కానీ, ధ్వంసం చేసే ఆలోచన కేంద్రానికి లేదన్నారు.ఇప్పటికే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్లాంట్ కు వచ్చి పరిశీలించి సానుకూలంగా స్పందించారని గుర్తుచేశారు.

అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదన్న హామీ మాత్రం పురందేశ్వరి ఇవ్వలేదు. కేవలం స్టీల్ ప్లాంట్ కాపాడి, లాభాల్లోకి తెస్తామని మాత్రమే చెప్పారు. గతంలో కేంద్రం కూడా పలుమార్లు ఇదే విషయం చెప్పింది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం ద్వారా అది పూర్తిగా మునిగిపోకుండా చూస్తామని మాత్రమే కేంద్రం గతంలో పార్లమెంట్ లోనూ వెల్లడించింది. దీంతో స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఏం చేయాలనే దానిపై కూటమి పార్టీల్లోనూ టెన్షన్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications