Purandeswari : టీడీపీతో పొత్తుపై నోరువిప్పిన పురందేశ్వరి- పవన్ తో కలిసి రూట్ మ్యాప్ ఇలా..
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత వేగంగా మారిన రాజకీయాల నేపథ్యంలో టీడీపీ-జనసేన కలిసి వచ్చే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించాయి. ఈ మేరకు చంద్రబాబును రాజమండ్రి జైల్లో కలుసుకున్న పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. దీంతో ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ ఇరుకునపడింది. అయితే బీజేపీని కూడా తమతో కలిసి వచ్చేలా ఒప్పిస్తానంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలతో బీజేపీ కూడా డిఫెన్స్ లో పడుతోంది.
ఈ నేపథ్యంలో ఏపీలో పొత్తులకు సంబంధించి ఇవాళ మరోసారి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. పొత్తులపై బీజేపీ అధిష్టానానిదే నిర్ణయం అంటూనే తన మనసులో మాట వెల్లడించారు. అంతే కాదు ఇన్నాళ్లూ కేవలం జనసేనతోనే తాము పొత్తులో ఉన్నట్లు చెబుతూ వచ్చిన పురందేశ్వరి ఇవాళ టీడీపీతో పొత్తు విషయం కూడా బయటపెట్టారు. టీడీపీతో పొత్తుకు సంబంధించి ఏం జరగబోతోందో హింట్ ఇచ్చేశారు.

టీడీపీతో పొత్తుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ అధిష్టానానికి వివరిస్తారని దగ్గుబాటి పురందేశ్వరి ఇవాళ విశాఖలో వెల్లడించారు. ఆ తర్వాత పొత్తులపై కేంద్ర నాయకత్వం తమ అభిప్రాయాలు కూడా తీసుకుంటుందని తెలిపారు. ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర నాయకత్వం కట్టుబడి ఉంటుందని పురందేశ్వరి వెల్లడించారు. తద్వారా టీడీపీతో పొత్తుపై కేంద్రంలో తాము నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో అభ్యంతరాలేవీ ఉండబోవని పరోక్షంగా చెప్పినట్లయింది.
టీడీపీతో పొత్తుపై ఇప్పటివరకూ ఎక్కడా నోరు మెదపని పురందేశ్వరి ఇవాళ దీనిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో భవిష్యత్తులో ఏం జరగబోతోందో సూత్రప్రాయంగా అర్ధమవుతోంది. త్వరలో జనసేనాని పవన్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో ఈ పొత్తుపై చర్చలు జరుపుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో పురందేశ్వరి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అలాగే చంద్రబాబు అరెస్టుతో దిగాలుగా ఉన్న టీడీపీకి కూడా పురందేశ్వరి వ్యాఖ్యలు బూస్ట్ ఇచ్చేలా ఉన్నాయి.












Click it and Unblock the Notifications