టీడీపీ-బీజేపీ పొత్తుపై సోము వీర్రాజు క్లారిటీ-పవన్ కోరిన రోడ్ మ్యాప్ రెడీ అవుతోందని వెల్లడి
ఏపీలో రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. తాజాగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై సమరశంఖం పూరించడం, ఈ సందర్భంగా వ్యాఖ్యలు మిగతా పార్టీల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా విపక్షాల్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై జనసేన మిత్రపక్షం బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ జనసేన సభలో రెండు విషయాలు చెప్పారు. ఇందులో ఒకటి వైసీపీకి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా చీలిపోకుండా చూస్తానని, దీనర్ధం టీడీపీ, బీజేపీలను తిరిగి దగ్గర చేస్తాననే విధంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందని తామెక్కడా చెప్పలేదన్నారు. ఇది కేవలం మీడియా అనుకుంటోందంటూ సోము వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీతో బీజేపీ పొత్తుపై ఇంకా క్లారిటీ రాలేదని అర్దమవుతోంది.
అలాగే పవన్ కళ్యాణ్ జనసేన సభలో బీజేపీ నుంచి 2024 ఎన్నికలకు రోడ్ మ్యాప్ కూడా కోరారు. అంటే 2024 ఎన్నికల్లో బీజేపీ ఎవరితో కలిసి ముందుకు వెళ్లాలనుకుంటోంది అనేది పవన్ ప్రశ్నించారు. దీనికి ఇంకా బీజేపీ నుంచి సమాధానం రాలేదు. అయితే ఇవాళ దీనిపై మాట్లాడిన సోము వీర్రాజు 2024 ఎన్నికలకు రోడ్ మ్యాప్ సిద్ధమవుతోందన్నారు. తద్వారా పవన్ కోరినట్లుగా బీజేపీ రోడ్ మ్యాప్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో త్వరలో ఈ రోడ్ మ్యాప్ బయటికి వస్తే అప్పుడు పొత్తులపై క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది.

మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ విమర్శల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే కేంద్రం ఇస్తున్న నిధుల్ని సొంత అవసరాలకు వైసీపీ ప్రభుత్వం వాడేస్తోందని బీజేపీ విమర్శిస్తోంది. ఇవాళ దీనిపై మరోసారి స్పందించిన సోము వీర్రాజు.. రాష్ట్రానికి కేంద్రం ఏం ఇచ్చిందో వైసీపీ మంత్రులతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.
వైసీపీ నవరత్నాలు కేంద్రం నిధులతో అమలు చేస్తున్నారని సోము ఆరోపించారు. ఏపీ పై ప్రత్యేక ప్రేమతో కేంద్రం ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఇస్తుందని సోము వెల్లడించారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజి తో ఎక్కువ నిధులు వచ్చాయని ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు జగన్ మాయలో పడి యూ టర్న్ తీసుకున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం నిధులతోనే నిర్మిస్తామని సోము వీర్హాజు ఇవాళ పునరుద్ఘాటించారు.












Click it and Unblock the Notifications