ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు-రాజధాని ఖరారు-రెండు పథకాలకు గ్రీన్ సిగ్నల్..!
ఇవాళ అమరావతిలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరికొన్ని నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ఇందులో రాజదానిగా అమరావతిని ఖరారు చేస్తూ తీసుకున్న నిర్ణయం కూడా ఉంది. దీంతో పాటు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రెండు కీలక పథకాలను ఈ నెలలో అమలు చేసేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు ఇంకొన్ని ఇతర నిర్ణయాలు కూడా ఉన్నాయి.
తాజాగా జరిగిన సీఆర్డీఏ భేటీలో పలు సంస్థలకు చేసిన భూకేటాయింపులకు కేబినెట్ ఇవాళ ఆమోదముద్ర వేసింది. వీటితో పాటు రాజధానిగా అమరావతిని ఖరారు చేసి కేంద్రానికి ప్రతిపాదన పంపాలని నిర్ణయించారు. గతంలో రాజధానిగా అమరావతిని ఖరారు చేసి పనులు చేపట్టినా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో తలెత్తిన ఇబ్బందుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ తీర్మానం ఆధారంగా విభజన చట్టంలో అమరావతిని రాజధానిగా చేర్చాలని కేంద్రాన్ని కోరనున్నారు.

మరోవైపు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రెండు కీలక పథకాలు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవను ఈ నెలలోనే అమలు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న దిశ సహా మూడు బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలని కోరాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో పాటు రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అలాగే తాజాగా పహల్గాం దాడులకు కౌంటర్ గా కేంద్రం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ పై కేబినెట్ చర్చించింది. ఈ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించిన భద్రతా దళాలకు అభినందనలు తెలుపుతూ కేబినెట్ తీర్మానం చేసింది. దీంతో పాటు సరిహద్దుల్లో నెలకున్న వాతావరణం, రాష్ట్రంపై ప్రభావం వంటి అంశాలపైనా మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications