AP CMO : ఏపీ సీఎంవోలో డిజిటల్ సంతకాల మోసం-ఐదుగురిని అరెస్ట్-సీఐడీ ప్రకటన..
ఏపీ సీఎంవోలో అతి పెద్ద మోసం బయటపడింది. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కొందరు కార్యదర్శుల డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేసిన వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ చురుగ్గా దర్యాప్తు చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇవాళ వెల్లడించారు. సీఎంవోలో డిజిటల్ సంతకాల మోసం కేసులో ఐదుగురు నిందితుల్ని అరెస్టుచేసినట్లు ఆయన ప్రకటించారు.
సీఎంవోలో పనిచేస్తున్న కొందరు కార్యదర్శుల డిజిటల్ సంతకాలను నిందితులు దుర్వినియోగం చేసి వేల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ డిజిటల్ సంతకాల దుర్వినియోగంతో సీఎం పిటిషన్లు జారీ చేసినట్లు సీఐడీ గుర్తించింది. ఇలా చేసిన ఒక్కో ఫైల్ కూ రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేసినట్లు సీఐడీ ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు ఇలా మోసం జరిగినట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ నుంచి 3 నెలలలో 66 సీఎం పిటిషన్లు జారీ చేసిన నిందితులు.. మొత్తం రూ.15లక్షల వరకూ వసూలు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. అయితే ఏ దస్త్రానికి తుది ఆమోదం రాలేదని, ఈ వ్యవహారంపై తదుపరి విచారణ చేస్తున్నామన్నారు. ఇలా జారీ అయిన పిటిషన్ల స్టేటస్ చెక్ చేసే సమయంలో మోసం బయటపడినట్లు తెలుస్తోంది. దీంతో సీఐడీ మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు ఏపీ సీఎంవోలో డిజిటల్ సంతకాల దుర్వినియోగంపై విపక్షాలు ఇప్పటికే జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రికి తెలియలేదని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఐడీ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు సాగిస్తోంది. ఇప్పటికే అరెస్టు చేసిన ఐదుగురు నిందితుల్ని కోర్టులో హాజరు పర్చి రిమాండ్ కూడా తరలించినట్లు తెలుస్తోంది. వీరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే తదుపరి వివరాలు బయటపడే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications