ఏపీలో వేడెక్కిన రాజకీయం: మోడీకి బాబు నమస్కారం! గొడవపడకుండా కేసీఆర్తో సిద్ధం
Recommended Video

అమరావతి: కేంద్రం తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గురువారం తీవ్ర ఆగ్రహం వచ్చింది. అన్ని సమస్యలు పూర్తయ్యే వరకు పోలవరం ప్రాజెక్టును ఆపివేయాలని కేంద్రం నుంచి లేఖ రావడంపై ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దీనిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించేందుకు తయారవుతున్నారు.
చదవండి: మోడీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం
మరో నాలుగు రోజుల్లో పదవీ విరమణ చేసే అధికారితో పోలవరం ప్రాజెక్టు అంశంపై లేఖ రాయించడంపై చంద్రబాబు ఆగ్రహోద్రులవుతున్నారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం అదే వైఖరితో ఉంటే వాళ్లకే అప్పగించి నమస్కారం పెడతానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత కేంద్రం తీరును ఆయన తీవ్రంగా ఎండగడ్డారు. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ రాజకీయం వేడెక్కింది.

అవసరమైతే తెగతెంపులకు సిద్ధం
చంద్రబాబు త్వరలో సౌత్ కొరియా పర్యటనకు వెళ్తున్నారు. అంతకుముందే ప్రధాని మోడీని, గడ్కరీని కలిసేందుకు సిద్ధమవుతున్నారు. విభజన హామీలపై మోడీకి మరికొన్ని రోజులు సమయం ఇచ్చి, ఆ తర్వాత అవసరమైతే తెగతెంపులకు కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

మోడీకి చంద్రబాబు నమస్కారం?
గురువారం సీఎం చంద్రబాబును పలువురు బీజేపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు ఆయనను చల్లబరిచారు. గుజరాత్ ఎన్నికల అనంతరం మాట్లాడుదామని చెప్పారు. అయితే సౌత్ కొరియా పర్యటనకు వెళ్లే ముందే మోడీని కలిసి విభజన హామీలపై మరికొన్ని రోజులు సమయం ఇచ్చి, అవసరమైతే ఆ తర్వాత గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

కేంద్రమంత్రితో మాట్లాడాక ఈ చిక్కులేంటి
విభజన నేపథ్యంలో కొత్త రాష్ట్రానికి కేంద్రం ఉదారంగా సహకరించాలని చంద్రబాబు చెబుతున్నారు. అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. పోలవరం టెండర్ల గురించి మాట్లాడుతూ.. కేంద్రమంత్రితో మాట్లాడిన తర్వాతే టెండర్లు పిలిచామన్నారు. అలాంటప్పుడు ఈ అభ్యంతరాలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

మిత్రపక్షం కాబట్టే సంయమనం
విభజన సమస్యలను పరిష్కరించాలని తాను కోరుతున్నానని, ఈ అంశాలపై తాను రాజకీయం చేయదల్చుకోలేదని చంద్రబాబు చెబుతున్నారు. బీజేపీ తమకు మిత్రపక్షం కాబట్టే సంయమనంతో వ్యవహరిస్తున్నామని, మరింత వేచిచూసే ధోరణి లేదని చెబుతున్నారు. మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఇచ్చి అవసరమైతే అనూహ్య నిర్ణయం తీసుకునేందుకు కూడా టీడీపీ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. తాను ఆశావాదిని అని, ఎదురు చూస్తానని కూడా చంద్రబాబు అంటున్నారు. అంటే కొద్ది రోజులు వేచి చూసి గుడ్ బై చెప్పే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

పోలవరం అప్పగించేందుకు సిద్ధం
పదేపదే విపక్షాలతో పాటు బీజేపీ నేతలు పోలవరం ప్రాజెక్టు కేంద్రం పరిధి లోనిది అని చెప్పడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఈ ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తానని చెప్పారు. కాగా, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబు కేంద్రంపై విరుచుకు పడటం గమనార్హం. పోలవరం పనులు ఆరు నెలలు ఆగిపోతే దారినపడటం కష్టమని చెప్పారు.

ఏ గొడవ లేకుండా తెలంగాణతో పరిష్కారానికి సిద్ధం
తెలంగాణ విషయమై కూడా చంద్రబాబు స్పందించారు. విభజన జరిగి ఇన్నేళ్లయినా సమస్యలు పూర్తి కాలేదన్నారు. ఎలాంటి గొడవ లేకుండా తెలంగాణతో సమస్యల పరిష్కారానికి తాను సిద్ధమని చెప్పారు. కాగా, పోలవరం లేఖ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ వేడి రాజేస్తున్నాయి.












Click it and Unblock the Notifications