వ్యాక్సినేషన్ డ్రైవ్ రికార్డ్పై జగన్ హ్యాపీ- కోవిడ్ వారియర్లను అభినందిస్తూ ట్వీట్
నిన్న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 8 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. అయితే లక్ష్యానికి మించి ఏకంగా 13.72 లక్షల డోసులు వేసి రికార్డు సృష్టించింది. దీనిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ఒక్క రోజులో సాధించిన ఈ ఫీట్తో దేశంలో వ్యాక్సిన్ల కొరత కూడా మరోసారి తెరపైకి వచ్చింది.
నిన్న ఏపీ వ్యాప్తంగా 13.72 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు విజయవంతంగా వేయడంపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ఇవాళ రెండు ట్వీట్లు చేశారు. అందులో ఈ ఫీట్కు కారణమైన కోవిడ్ వారియర్లకు అభినందనలు తెలిపారు. అలాగే ఏపీ సత్తా ఏంటో తెలిసిందనే అర్దం వచ్చేలా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో జగన్ ట్వీట్ వైరల్ అవుతోంది. లక్ష్యాన్ని మించి రికార్డు వ్యాక్సినేషన్ జరగడానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ జగన్ తన ట్వీట్ ద్వారా కంగ్రాట్స్ చెప్పారు.
కోవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా ఏపీ 13.72 లక్షల డోసుల టీకాలు వేసి ఓ ఉదాహరణగా నిలిచిందని జగన్ ప్రశంసించారు. ఈ ఘనత గ్రామ, వార్డు సచివాలయాలకు, వాలంటీర్లకు, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు, పీహెచ్సీ డాక్టర్లకు, మండల అధికారులకు, జేసీలు, కలెక్టర్లకు దక్కుతుందన్నారు. మీ ప్రయత్నాలతో తగినన్ని వ్యాక్సిన్లు ఇస్తే మనమేం చేయగలమో దేశానికి నిరూపించామని జగన్ కొనియాడారు. ఇలాంటి కఠినమైన సమయంలో ఈ ఘనతకు కారణమైన ప్రతీ ఒక్క కోవిడ్ వారియర్కు అభినందనలు తెలుపుతున్నట్లు జగన్ పేర్కొన్నారు.