దేవుడితో చెలగాటం ఆడితే దేవుడు తప్పక శిక్షిస్తాడు .. విగ్రహ ధ్వంసం ఘటనలపై సీఎం జగన్ స్పందన ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దేవుడితో చెలగాటం ఆడితే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడని సీఎం జగన్ పేర్కొన్నారు. విగ్రహాల విధ్వంసం వంటి ఘటనలకు పాల్పడితే తీవ్ర పరిణామాలను చవి చూడాల్సి వస్తుందని సీఎం జగన్ హెచ్చరించారు. అధికారులను ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడం కోసం చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.

ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహ ధ్వంసం ఘటనలు .. జగన్ పై, వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్వేది రథ దగ్ధం ఘటన తర్వాత నుంచి ఇప్పటివరకు అనేక ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హిందూ దేవతా మూర్తులు విగ్రహాలను ధ్వంసం చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో కోదండరామ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆయన శిరస్సును బోధి కొండపై ఉన్న రామ కొలనులో పడవేసిన ఘటన నేపథ్యంలో ఏపీలో మరోమారు సీఎం జగన్ పై, వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు వెల్లువెత్తాయి.

పోలీసులు తక్షణం చర్యలు తీసుకోవాలన్న జగన్
ఆలయాలపై దాడులు, దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం కొనసాగుతున్న సీఎం జగన్ కనీసం స్పందించడం లేదంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు సైతం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆలయాలపై దాడులు, విగ్రహ ధ్వంసం ఘటనలపై స్పందించిన జగన్ దేవుడితో చెలగాటమాడింది దేవుడే శిక్షిస్తాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విగ్రహాల ధ్వంసం ఘటనలకు పాల్పడకుండా ఆలయ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనపై పోలీసులు తక్షణం చర్యలు తీసుకోవాలని జగన్ పేర్కొన్నారు.
అల.. వైకుంఠపురములో హీరోయిన్ నివేదా పేతురాజ్ను ఇలా ఎప్పుడూ చూసుండరు

రాష్ట్రంలో ఆ మాట వినిపించకుండా చెయ్యండి .. సీఎంఓ అధికారులతో జగన్
అంతేకాదు ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి ఇంటి పట్టా రాలేదనే మాట ఎక్కడ వినిపించ కూడదని, ఇళ్ల పట్టాలు అర్హులందరికీ అందాలని జగన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో సమావేశమైన జగన్ రాష్ట్రంలో పింఛన్ , ఇళ్ల పట్టాలు, బియ్యం కార్డులకు సంబంధించి సచివాలయాల్లో దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. సీఎంఓ అధికారుల భేటీలో జగన్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.

రామతీర్ధం విగ్రహ ధ్వంసం ఘటనలో ఇంకా దొరకని నిందితులు .. గాలిస్తున్న పోలీసులు
విజయనగరం జిల్లా రామతీర్థం భోధి కొండపై శతాబ్దాల నాటి రామాలయంలో శ్రీరాముడు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా హిందువులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ ఘటనపై భక్తులు మండిపడుతున్నారు. గత రెండు రోజులుగా టిడిపి, బిజెపి, జనసేన నేతలు ఈ ఘటనపై ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే రామతీర్థం ఘటనలో ఇప్పటివరకు నిందితుల ఆచూకీ దొరకలేదు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ కోసం దేవాదాయ శాఖ ఆర్ జె సి స్థాయి అధికారి భ్రమరాంబను విచారణ అధికారిగా నియమించారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరని త్వరగా తేల్చాలని, కఠిన చర్యలకు ఉపక్రమించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications