14న పోలవరానికి జగన్-గోదావరి వరద పోటు వేళ నిర్వాసితుల పరామర్శ
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 14న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి నేరుగా పోలవరం ప్రాజెక్టు వద్దకు ప్రత్యేక విమానంలో జగన్ వెళ్లనున్నారు. అక్కడ అధికారులతో ప్రాజెక్టు పనుల పురోగతిని సీఎం జగన్ సమీక్షించనున్నారు.
వర్షాల సీజన్ కావడంతో గోదావరిలో వరద ప్రభావం భారీగా ఉంది. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న ఇన్ ఫ్లోతో గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనులకు కూడా అంతరాయం కలుగుతోంది. అదే సమయంలో పోలవరం, సమీప గ్రామాలు కూడా నీట మునుగుతున్నాయి. ప్రస్తుతం పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 27 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది. దీంతో కాఫర్ ఎగువనున్న తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ముంపు గ్రామాల ప్రజల్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్ రాక నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ తో పాటు ఇంజనీర్ ఇన్ ఛీఫ్ కూడా పోలవరం బయలుదేరి వెళ్లారు. 14న ఉదయం పోలవరం ప్రాజెక్టుకు చేరుకోనున్న జగన్.. ముందుగా ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలిస్తారు. అనంతరం నిర్వాసితుల అంశంపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించే అవకాశమున్నట్టు జలవనరులశాఖ అధికారులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం.. ఆ మేరకు అధికారుల్ని పరుగులు పెట్టిస్తోంది.












Click it and Unblock the Notifications