సీఎం జగన్ సింహం; ఆయనను బ్రహ్మదేవుడు కూడా జైలుకు పంపించలేడు: నారాయణ స్వామి సంచలనం
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి బిజెపి ప్రజాగ్రహ సభపై, బిజెపి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూనే ఉన్నారు. గురువారం రోజు ఉదయం తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఆళ్ల నాని తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి తిరుమల టీటీడీ అధికారులు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
జగన్ సింహం లాంటి వాడు
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన నారాయణస్వామి అవినీతికి పాల్పడిన వారు జైలుకు వెళ్లక తప్పదు అంటూ జగన్ ను టార్గెట్ చేస్తూ బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.సీఎం జగన్ ఎక్కడ ఎలాంటి చిన్న తప్పు కూడా చేయలేదని అనవసరంగా ఆయన పైన బురద జల్లుతున్నారని ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. సీఎం జగన్ సింహం లాంటివాడని, ఎంతమంది వచ్చినా ఒంటరిగానే పోరాటం చేయగలిగిన దమ్ము ధైర్యం ఉన్న వాడని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పుకొచ్చారు.
జగన్ ను జైలుకు పంపటం ఆ బ్రహ్మ వల్ల కూడా కాదు
జగన్ ను జైలుకు పంపడం ఎవరితరం కాదని శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు మెండుగా ఉంటాయని నారాయణస్వామి తెలిపారు. జగన్ ను జైలుకు పంపడం బ్రహ్మదేవుడు తరం కూడా కాదని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇక మరోమారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పై విరుచుకుపడిన నారాయణస్వామి సోము వీర్రాజు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు గా ఎందుకు చేశారో అర్థం కావడం లేదని విమర్శించారు.
చీప్ లిక్కర్ 50 రూపాయలు ఇచ్చి ప్రజలను సంతోషపెడతాను అని సోము వీర్రాజు చెప్పడాన్ని తప్పుబట్టిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి మద్యం ఇస్తామని చెప్పి ఎవరైనా ఓట్లు అడుగుతారా అంటూ ప్రశ్నించారు.
తాగుబోతులకు సోము వీర్రాజు అధ్యక్షుడా?
సోము వీర్రాజు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకైనా అర్థం అవుతుందా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సారా ఇచ్చి ఎవరైనా ఓట్లు అడుగుతారా అంటూ ప్రశ్నించారు. తాగుబోతులకు ఆయన అధ్యక్షుడు అయ్యాడేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేసినా సోము వీర్రాజు లాంటి వారు అధ్యక్షులుగా ఉంటే చీప్ లిక్కర్ ఇచ్చి ఓట్లు అడిగే దౌర్భాగ్యస్థితి బిజెపికి ఉంటుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఎజెండానే బిజెపి కూడా అమలు చేస్తోందని నారాయణస్వామి పేర్కొన్నారు.
బీజేపీపై సినిమా టికెట్ల ధరలపై ఇప్పటికే నారాయణ స్వామి ఆగ్రహం
ఇదిలా ఉంటే బుధవారం నాడు కూడా నారాయణస్వామి బిజెపి నేతలపై, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పై, అలాగే ఏపీలో సినిమా టికెట్ల ధరల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమ పై మూడు కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతుందని. కొత్త వారికి థియేటర్లు కూడా ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపి డిప్యూటీ సీఎం నారాయణస్వామి.రాజకీయాల్లో వారసత్వం గురించి మాట్లాడతారని, సినిమారంగంలో వారసత్వం మాటేమిటని ప్రశ్నించారు. సినిమా రంగంలో ఉన్న వారు జిఎస్టి సరిగా కట్టడం లేదని, నష్టపోతున్న నిర్మాతలను ఆదుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు.