కమ్మ, రెడ్డి సెటిలర్లను అడ్డుకోండి- జగన్ కు డిప్యూటీ సీఎం సంచలన విజ్ఞప్తి...
ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో ఆయనో డిప్యూటీ సీఎం. గిరిజన నియోజకవర్గం నుంచి వరుసగా విజయాలు సాధిస్తున్న వైసీపీ సీనియర్ నేత. రాజకీయాల్లో ఎక్కడ ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉంటూ రాష్ట్రంలో రెండు కీలక సామాజిక వర్గాలపై ఇవాళ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు సామాజిక వర్గాల వల్ల తన నియోజవర్గం నష్టపోతోందంటూ ఆ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఇవాళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో పెరుగుతున్న కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల హవాతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఆయన ఏకరువు రెట్టారు. ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన సెటిటర్ల వల్ల సాలూరు నియోజకవర్గం నష్టపోతోందంటూ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు.

సాలూరులో కమ్మ, రెడ్డి సెటిలర్ల వల్ల గిరిజనులకు నష్టం జరుగుతున్నట్లు రాజన్న దొర తెలిపారు. దీన్ని అడ్డుకునేందుకు, గిరిజిన ప్రయోజనాలు కాపాడేందుకు ఈ నియోజకవర్గాన్ని షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం జగన్ ను కలిసి విజ్ఞప్తి చేయబోతున్నట్లు రాజన్నదొర ప్రకటించారు. దీంతో సాలూరు నియోజకవర్గంలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల సెటిలర్లు ఆ స్ధాయిలో ప్రభావం చూపుతున్నారా అన్న చర్చ మొదలైంది.
ఎస్టీ నియోజకవర్గమైన సాలూరు నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న రాజన్నదొర జగన్ రెండోసారి కేబినెట్ విస్తరణలో డిప్యూటీ సీఎం అయ్యారు. అయినా రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఏకంగా తన నియోజకవర్గంలో సైతం కమ్మ, రెడ్డి సెటిలర్లు నష్టం చేస్తున్నారంటూ రాజన్నదొర చేస్తున్న వ్యాఖ్యలతో నియోజకవర్గంపైనా ఆయన పట్టు సడలుతోందా అన్న చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications