ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్- మే 1 నుంచి పండగే..
ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ ఉద్యోగ సంఘాలతో సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ వారికి పలు హామీలు ఇచ్చింది. ఇందులో వారికి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పలు సమస్యల పరిష్కారంతో పాటు పీఆర్సీ నియామకం వంటి హామీ కూడా ఉంది. దీంతో ఈసారి ఉద్యోగ నేతలతో సబ్ కమిటీ భేటీ సానుకూలంగా ముగిసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ జేఏసీ అమరావతి ప్రభుత్వం విధానాలపై క్షేత్రస్ధాయిలో ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు వెలువడ్డాయి.
ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన భేటీలో ప్రభుత్వం తరఫున మంత్రి బొత్స సత్యానారాయణ, సలహాదారు సజ్జల, ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎస్ రద్దు, డీఏ బకాయిలతో పాటు పలు అంశాలు చర్చకు వచ్చాయి. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స ఉద్యోగులకు త్వరలో పీఆర్సీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 11వ పీఆర్సీ అమలుపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో 12వ పీఆర్సీ నియామకం త్వరలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అలాగే మే 1 నుంచి ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలకు సంబంధించి వరుసగా జీవోలు విడుదల చేస్తామని మంత్రి బొత్స ప్రకటించారు. ఇప్పటికే డీఏ బకాయిలపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిగా ఉన్న నేపథ్యలో వాటిలో కొన్నయినా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ జరిగిన ఉద్యోగ నేతల భేటీలో ప్రభుత్వం తరఫున మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఈ మేరకు మే 1 నుంచి జీవోలు వెలువడనున్నాయి.

మరోవైపు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల తర్వాత మాట్లాడిన మంత్రి బొత్స... కొన్ని ఉద్యోగ సంఘాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలు సామరస్యంగా వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వానికి ఎవరిపైనా వివక్ష ఉండదని, ఉద్యోగులంతా తమ కుటుంబ సభ్యులేనని తెలిపారు. ప్రభుత్వంతో టచ్ లో ఉన్న ఉద్యోగ సంఘాల నేతలతో ఇవాళ భేటీ అయ్యామని, సీపీఎస్ పై ఇతర సంఘాల నేతలు చేస్తున్న ప్రకటనలపై స్పందించబోనని బొత్స పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications