మూడు రాజధానులపై హైకోర్టు విచారణ- నేటి నుంచి ప్రభుత్వం తరఫున రంగంలోకి దుష్యంత్ దవే
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ కొనసాగుతోంది. ఇప్పటివరకూ పిటిషనర్లు తమ వాదనలు వినిపించగా.. ఇవాళ్టి నుంచి ఏపీ ప్రభుత్వం తమ వాదనలు వినిపించబోతోంది. రాజధాని అంశంతో సంబంధమున్న వ్యాజ్యాలపై హైకోర్టులో ప్రభుత్వ వాదనలు ఇవాళ ప్రారంభం కానున్నాయి.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చాయి.
అడ్వకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ స్పందిస్తూ వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే మంగళవారం కోర్టుకు హాజరుకానున్నారని తెలిపారు.
విచారణను మంగళవారానికి వాయిదా వేయాలని కోరగా ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. దీంతో ఇవాళ్టి నుంచి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు దుష్యంత్ దవే సిద్ధమయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న దుష్యంత్ దవే రాకతో ఈ పిటిషన్ల విచారణలో ఉత్కంఠ మరింత పెరిగింది.
రాజధానితో సంబంధం ఉన్న అంశాల్లో పిటిషనర్లు తాజాగా తమ వాదనలు వినిపించారు. వీటిలో మూడు రాజధానుల ఏర్పాటు ఏ విధంగానూ సమంజసం కాదని వారు వాదించారు. మరోవైపు పాలనా వికేంద్రీకరణ చట్టం ప్రకారం అభివృద్ధికి చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కర్నూలుకు చెందిన న్యాయవాది నాగలక్ష్మిదేవి వేసిన వాజ్యాన్ని త్వరగా విచారించాలని న్యాయవాది శరత్కుమార్ ధర్మాసనాన్ని కోరారు. కానీ దీనిపై తక్షణ విచారణ జరపలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇతర కేసుల విచారణ సందర్భంగా దీన్ని విచారిస్తామని తెలిపింది.