Fact Check: ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయా ? ప్రభుత్వం క్లారిటీ ..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీల పెంపుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలతో ప్రస్తుతం బిల్లుల్ని పోల్చి చూపుతూ విద్యుత్ ఛార్జీలు పెరిగాయనే ప్రచారాన్ని తెరపైకి తేస్తున్నారు. పలు చోట్ల ఇందుకు నిదర్శనంగా పెరిగిన విద్యుత్ బిల్లులు దర్శనమిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో తమకు ఓటేస్తే కరెంటు ఛార్జీలు పెంచబోమని, పైపెచ్చు తగ్గిస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు గత ఎన్నికల్లో ప్రచార సమయంలో చేసిన ప్రకటనను వైసీపీ సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం చేస్తోంది. ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయంటూ వివిధ మీడియాల్లో వస్తున్న వార్తా కథనాలను ఇందుకు జత చేస్తోంది. అలాగే రాష్ట్రంలోనూ పలుసార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయంటూ వైసీపీ ఆందోళనలకు కూడా దిగింది. దీంతో నిజంగానే రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెరిగాయన్న భావన అందరిలోనూ కలుగుతోంది.

దీనిపై ఇవాళ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టేలా స్పష్టమైన ప్రకటన చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఎడాపెడా విద్యుత్ చార్జీలు పెంచేసినట్టు కొందరు చేస్తున్న ఈ ప్రచారం అబద్ధం అని తెలిపింది. కొత్త ప్రభుత్వం వచ్చాక, కరెంటు చార్జీలు పైసా కూడా పెంచలేదని వెల్లడించింది. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నవన్నీ ఇవన్నీ 2022-24 మధ్య వేసిన చార్జీలే అని తెలిపింది.
ప్రస్తుత ప్రభుత్వం ఎడాపెడా విద్యుత్ చార్జీలు పెంచేసినట్టు కొందరు చేస్తున్న ఈ ప్రచారం అబద్ధం. కొత్త ప్రభుత్వం వచ్చాక, కరెంటు చార్జీలు పైసా కూడా పెంచలేదు. ఇవన్నీ 2022-24 మధ్య వేసిన చార్జీలే.
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) April 17, 2025
2022-23లో ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట రూ.6,300 కోట్ల ట్రూ అప్ చార్జీలు... అలాగే… pic.twitter.com/34UMOp13Xm
2022-23లో ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట రూ.6,300 కోట్ల ట్రూ అప్ చార్జీలు విధించారని, అలాగే 2023-24లో మరోసారి ఇంధన సర్దుబాటు చార్జీల కింద రూ.9,200 కోట్ల చార్జీలు విధించారని ప్రభుత్వం తెలిపింది. ఆనాటి చార్జీల భారమే ఇప్పుడు వినియోగదారుల మీద ఉన్నదని పేర్కొంది. అంతేకాని కొత్త ప్రభుత్వం వచ్చాక, కరెంటు చార్జీలు పైసా కూడా పెంచలేదని మరోసారి చెబుతున్నామని తెలిపింది. కాబట్టి ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మొద్దని ప్రభుత్వం కోరింది.












Click it and Unblock the Notifications