నేటి నుంచి ఏపీలో పర్యాటక స్ధలాలన్నీ ఓపెన్- రోప్వే, బోటింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ సహా...
ఏపీలో కరోనా కారణంగా కొన్ని నెలలుగా ఆగిపోయిన పర్యాటక స్ధలాల సందర్శన తిరిగి ప్రారంభమవుతోంది. రాష్ట్రంలోని అన్ని పర్యాటక స్ధలాలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పర్యాటక ప్రాంతాలతో పాటు రోప్వే, బోటింగ్, సాహస క్రీడలను కూడా తిరిగి ప్రారంభిస్తున్నారు. దీంతో ఏపీకి మళ్లీ పర్యాటక కళ రానుంది.
గతేడాది వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు పర్యాటకశాఖ ప్రణాళికలు సిద్ధం చేసిన తరుణంలో కోవిడ్ మహమ్మారి ప్రభావంతో పర్యాటక స్ధలాలన్నీ మూతపడ్డాయి. దీంతో పర్యాటక శాఖ ఆదాయానికి తీవ్రంగా గండిపడటంతో పాటు పర్యాటక స్ధలాల నిర్వహణ కూడా ఇబ్బందికరంగా మారింది. ఈ దశలో కేంద్రంతో చర్చించి అన్ని కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ పర్యాటక స్ధలాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి పొందింది. దీని ప్రకారం పర్యాటక స్ధలాల్లో అన్ని కోవిడ్ జాగ్రత్తలను పాటించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు తమ సిబ్బందికి కూడా తగిన శిక్షణ ఇచ్చినట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.
కృష్ణా, గోదావరి నదుల్లో బోటు ప్రమాదాల దృష్ట్యా ప్రత్యేక కమాండ్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు బోట్లకు అనుమతులను కూడా కఠిన తరం చేశారు. ఈ కమాండ్ సెంటర్ల ఏర్పాటు తర్వాత కరోనా కారణంగా బోటింగ్ సాధ్యం కాలేదు. దీంతో తొలిసారిగా అన్ని జాగ్రత్తలు తీసుకుని బోటింగ్కు ప్రభుత్వం అనుమతులు ఇస్తోంది. బోటింగ్లోనూ కరోనా నియంత్రణ కోసం భౌతిక దూరంతో పాటు జాగ్రత్తలు తీసుకుంటోంది.