ఏపీలో మందుబాబులకు మరో షాక్- ప్రీమియం బ్రాండ్లపై పెంపు- చీప్ లిక్కర్పై తగ్గింపు..
ఏపీలో మద్యం ధరల్లో ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది. మద్యం వినియోగం తగ్గించడంతో పాటు మద్యం దొరక్క జరుగుతున్న మరణాలను అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం ధరల్లో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పేదలు తాగే తక్కువ బ్రాండ్లు, తక్కువ పరిమాణం మద్యం ధరలను తగ్గించిన ప్రభుత్వం, ప్రీమియం బ్రాండ్లను, ఎక్కువ పరిమాణం ఉన్న బాటిళ్లపై మాత్రం పెంచింది.
120 రూపాయల ధర లోపు ఉన్న అన్ని బ్రాండ్ల మద్యంపై 10 రూపాయల నుంచి 120 రూపాయల వరకూ ధరలు తగ్గించారు. అలాగే 120 నుంచి 150 రూపాయల మధ్య రేటు ఉన్న అన్ని బ్రాండ్ల మద్యంపైనా 30 నుంచి 280 రూపాయల వరకూ తగ్గాయి. కానీ 190 నుంచి 600 మధ్య రేటు ఉన్న అన్ని మద్యం బ్రాండ్ల రేట్లూ పెరిగాయి. ఈ పెరుగుదల కూడా 40 రూపాయల నుంచి 1320 రూపాయల వరకూ ఉంది. బీరులో అన్ని కేటగిరీల రేట్లు కూడా 30 రూపాయల మేర తగ్గాయి. అలాగే రెడీ టూ డ్రింగ్ వెరైటీల ధరలనూ 30 రూపాయలు తగ్గించారు. మిగతా రేట్లు యథాతథంగా ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.
Recommended Video
కొంతకాలంగా తక్కువ క్వాలిటీ మద్యం దొరక్క పేదలు, కూలీనాలీ చేసుకునే వారు శానిటైజర్లు తాగి చనిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం వీటి ధరలను తగ్గించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రీమియం బ్రాండ్లు, ధర ఎక్కువగా ఉన్న వాటిని మరింత పెంచినట్లు అర్ధమవుతోంది. దీన్ని ప్రభుత్వం ధరల హేతుబద్దీకరణగా పేర్కొంటోంది. మద్యం వినియోగాన్ని తగ్గించేందుకే ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.