ఏపీలో ప్రమాద ఘంటికలు- 3 వేల మంది హోం క్వారంటైన్ ఉల్లంఘన- కేసుల నమోదు..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుందని భావిస్తున్న తరుణంలో తాజాగా వెలువడుతున్న వార్తలు ఆందోళన రేపేలా ఉన్నాయి. కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉంచిన వేలాది మంది నిబంధనలను ఉల్లంఘించి జనంలో కలిసిపోతున్నట్లు తాజాగా వెలువడిన నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో వీరిని హోం క్వారంటైన్ మొబైల్ యాప్ ద్వారా గుర్తించి పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
హోం క్వారంటైన్ వదలి జనంలోకి..
ఏపీలో కరోనా లక్షణాలతో 21 వేల మందిని ప్రభుత్వం హోం క్వారంటైన్ లో ఉంచింది. వీరిని సర్వేలు, ఫిర్యాదులు, ఇతర మార్గాల ద్వారా గుర్తించి ఇళ్లకే పరిమితం చేశారు. వీరి చేతులకు బ్యాండ్ లు కూడా వేశారు. కానీ వీరిలో మూడు వేల మందికి పైగా హోం క్వారంటైన్ ను ఉల్లంఘించి జనంలో తిరుగుతున్నట్లు మొబైల్ యాప్ ద్వారా గుర్తించారు. హోం క్వారంటైన్ లో ఉన్న వారు 50 మీటర్ల దూరం దాటి వెళ్లకూడదన్న నిబంధన ఉన్నా పట్టించుకోకుండా షాపింగ్, ఇతర అవసరాల కోసం జనంలోకి వచ్చేస్తున్నారు.
పోలీసు కేసులు-- కౌన్సెలింగ్..
కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ విధించిన వారిలో నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ సార్లు బయటకు వచ్చిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మరికొందరికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. భవిష్యత్తులో ఉల్లంఘనలు పెరిగితే కేసులతో పాటు జైళ్లకు పంపేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా నిర్లక్ష్యంగా రోడ్లపైకి వచ్చే వారిని వదిలిపెట్టబోమని పోలీసులు చెప్తున్నారు. హోం క్వారంటైన్ యాప్ ద్వారా వీరి కదలికలను గుర్తిస్తున్న పోలీసులు, ఇప్పటికే వారి ఇళ్లను సైతం జియోట్యాగింగ్ చేశారు. వీరు ఇళ్లను దాటి 50 మీటర్లు దూరంలోకి వస్తే కంట్రోల్ రూమ్ కు నేరుగా మెసేజ్ వస్తోంది.
ఉల్లంఘనుల్లో విదేశీయులే అధికం...
విదేశాల నుంచి క్వారంటైన్ తీసుకోకుండా మన దేశంలోకి వచ్చేసిన వారిని కరోనా ఆరంభ దశలో గుర్తించిన ప్రభుత్వం హోం క్వారంటైన్ లో ఉంచింది. వీరిని హోం క్వారంటైన్ యాప్ లో చేర్చడంతో పాటు నిరంతర నిఘా పెట్టింది. అయినా వీరు నిర్లక్ష్యంగా రోడ్లపైకి రావడం ద్వారా కరోనా వ్యాప్తికి, ప్రజల ప్రాణాలను హరించే చర్యలకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిలో అత్యధికులు సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనే ఉన్నారు. కడపలో 635 మంది, పశ్చిమగోదావరిలో 424 మంది, తూర్పుగోదావరిలో 352 మంది, చిత్తూరులో 185 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. త్వరలో వీరిపై కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు.
Recommended Video