ఏపీలో ప్రైవేటు స్కూలు, కాలేజీ విద్యార్ధులకు భారీ ఊరట - ఫీజులపై కీలక నిర్ణయం-
ఏపీలో కరోనా వైరస్ కారణంగా విద్యాసంస్ధలు మూతపడ్డాయి. వాటితో పాటే అన్ని రంగాలూ స్తంభించిపోయాయి. కరోనా వ్యాప్తి భయాలతో విద్యాసంస్ధలను నడపలేని పరిస్దితి. అయితే ఓసారి విద్యాసంస్ధలు తెరిచాక ఫీజులపై యాజమాన్యాలు విద్యార్ధుల తల్లితండ్రులను ఇబ్బందులకు గురిచేయకుండా ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. వీటిని రాష్ట్రంలో అన్ని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు తప్పక అమలు చేయాల్సిందేనని సూచించింది.
ఏపీలో ప్రైవేటు విద్యార్ధులకు ఊరట...
ఏపీలో కరోనా వైరస్ కారణంగా నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో ప్రైవేటు విద్యాసంస్ధలు విద్యార్ధుల తల్లితండ్రులను ఫీజుల పేరుతో వేధించకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం స్కూళ్లు, కాలేజీలు తెరిచాక గత విద్యాసంవత్సరంలో నిర్ణయించిన మేరకు మొదటి మూడు నెలల ట్యూషన్ ఫీజును మాత్రమే వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇంతకు మించి అదనపు మొత్తాలని వసూలు చేయొద్దని ఏపీ పాఠశాల విద్య నియంత్రణ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది.
వీలైతే వాయిదాల్లోనూ...
Recommended Video
ఏపీలో కరోనా వైరస్ సంక్షోభం ముగిశాక స్కూళ్లు తెరిచినప్పుడు ప్రైవేటు విద్యాసంస్ధల యాజమాన్యాలు విద్యార్ధుల నుంచి మొదటి మూడు నెలల ట్యూషన్ ఫీజును మాత్రమే వసూలు చేయడమే కాకుండా దాన్ని కూడా వీలైతే రెండు విడతల్లో చెల్లించే అవకాశం ఇవ్వాలని కమిషన్ సూచించింది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు దెబ్బతిని విద్యార్ధుల తల్లితండ్రులు సైతం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని, మానవతా దృక్పథంతో మొదటి మూడు నెలల ట్యూషన్ ఫీజును సైతం 45 రోజుల విరామంతో రెండు విడతల్లో చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని సూచించింది.