ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కొత్త డెడ్ లైన్..అప్పుడే అంటున్న సజ్జల
ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న వైసీపీ నేతలకు, ఆశావహులకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం స్ధానిక సంస్ధల ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న తరుణంలో పార్టీ విజయం కోసం కష్టపడాలని, కష్టపడ్డ వారికే పోస్టుల్లో ప్రాధాన్యమిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ అప్పుడే..
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీ కోసం గతంలో ఎన్నో కష్టాలు పడి నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న వారంతా వీటిలో హ్యాండిస్తారేమో అన్న భయం వైసీపీని వెంటాడుతోంది. దీంతో స్ధానిక సంస్ధల ఎన్నికలు ముగిశాకే నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనంతపురంలో ప్రకటించారు. అనంతపురంలో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు.
పోస్టులు కావాలంటే కష్టపడాల్సిందే : సజ్జల
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడాలని అన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచితే కఠిన చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేశారని తెలిపారు.
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని అభినందించారు. 9 మాసాల్లో 90 శాతం హామీలు నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్దే అని కితాబిచ్చారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను జగన్ బలోపేతం చేశారని అన్నారు. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ దేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడని, ఆయన అమలుచేసే పథకాలపై యావత్దేశం ఆసక్తి చూపుతోందని పేర్కొన్నారు.
Recommended Video
సీమ, విశాఖల్లో బాబు అమరాతి నినాదాలా ?
ఐదేళ్ల పాలనలో విపక్ష నేత చంద్రబాబు ఖజానాను ఖాళీ చేసి వెళ్లారని, అప్పులు సైతం పుట్టకూడదన్న అక్కసుతో కుట్రలు చేశారని సజ్జల ఆరోపించారు. ఇప్పుడు అధికార వికేంద్రీకరణపై చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని, విశాఖ, రాయలసీమ జిల్లాల్లో జై అమరావతి నినాదాలు చేసి చంద్రబాబు అభాసుపాలయ్యారని సజ్జల తెలిపారు. అలాంటి చంద్రబాబుకు ఎల్లో మీడియా వత్తాసు పలకడం దురదృష్టకరమన్నారు..