జగన్ డిమాండ్ పై తేల్చేసిన హోంమంత్రి..! కీలక సూచన..!
ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వీటికి హాజరు కావాలని అధికార పక్షం నుంచి తొలుత విజ్ఞప్తులు, అనంతరం అనర్హత వేటు వేస్తామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయి. అయినా జగన్ కానీ, వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వెనక్కి తగ్గడం లేదు. అసెంబ్లీకి వచ్చేది లేదంటున్నారు. అనర్హత వేటు వేస్తే వచ్చే ఉపఎన్నికలను ఎదుర్కొనేందుకు సైతం ప్లాన్ చేసుకుంటున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్ తాను ఎమ్మెల్యేగా హాజరైతే అసెంబ్లీలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వరని, అందుకే ప్రతిపక్ష హోదా అడుగుతున్నట్లు చెప్తున్నారని హోంమంత్రి అనిత తెలిపారు. మీకు టైం ఇస్తే వస్తానని చెప్తున్నారని, కానీ అది ఇచ్చేది తామో, స్పీకరూ కాదన్నారు. ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా అన్నారు. విపక్ష నేత హోదా ఇచ్చేందుకు కావాల్సిన సీట్లు రాలేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగానే అసెంబ్లీకి రావాలన్నారు.

ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగానే అసెంబ్లీకి రావాలన్నారు. దాని ప్రకారమే ప్రమాణస్వీకారం చేసేందుకు అవకాశం ఇచ్చామన్నారు. కానీ ఇవాళ విపక్ష నేత హోదా కావాలంటూ మారాం చేయకూడదన్నారు. అదేమీ చాక్లెటూ, బిస్కెటో కాదన్నారు. అరిచి గీపెడితే ఇవ్వడానికి అన్నారు. ప్రజలు ఇవ్వాల్సిన సీట్లు ఇవ్వలేదనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. గతంలో చంద్రబాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినప్పుడు కూడా ఆయన మాత్రమే రాలేదని, మిగతా ఎమ్మెల్యేలను మాత్రం అసెంబ్లీకి పంపాలన్నారు.

తనకు విపక్ష నేత హోదా ఇవ్వలేదని, మిగతా ఎమ్మెల్యేలను కూడా అడ్డుకోవడం సరికాదన్నారు. అసెంబ్లీ అనే వేదికను కూడా వైసీపీ ఎమ్మెల్యేలకు లేకుండా చేసి ప్రజాసమస్యలపై తప్పుదోవ పట్టించేలా బయట మాట్లాడటం సరికాదన్నారు. ఇది మంచి పద్దతి కాదని, ప్రజాస్వామ్యానికి విరుద్దమన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్లి రాజీనామా చేస్తానంటున్నారని, దీనిపై తాము చేయగలిగిందేమీ లేదన్నారు.












Click it and Unblock the Notifications