జోగయ్య దీక్షకు మద్దతివ్వకపోతే ప్రశ్నిస్తారా ? అప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదన్న అంబటి ..!
ఏపీలో కాపు రిజర్వేషన్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇదే డిమాండ్ తో కాపు నేత చేగొండి హరిరామజోగయ్య దీక్ష కూడా చేపట్టారు. ఆయన ఆరోగ్య పరిస్ధితి దృష్ట్యా ప్రభుత్వం దీన్ని భగ్నం చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు కాపు నేతల నుంచి సంఘీభావం లభించింది. కానీ వైసీపీలో ఉన్న కాపు మంత్రి అంబటి మాత్రం మౌనంగా ఉన్నారు. దీనిపై కాపు నేతలు విమర్శలు చేస్తున్నారు. దీనిపై అంబటి తీవ్రంగా స్పందించారు.
కేంద్రం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇస్తే అందులో 5 శాతం కాపులకు ఇవ్వాలని కోరుతూ హరిరామజోగయ్య దీక్ష చేపట్టారని, దాన్ని ఎట్టకేలకు విరమించారని అంబటి తెలిపారు.. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. హైదరాబాద్ నుంచి సంప్రదింపులు చేసి విరమింపజేసినట్లు పత్రికల్లో చూశామన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు వాగ్దానం చేసి కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేదని ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తే ఎలా వేధించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అప్పుడు పవన్ మాట్లాడటానికి ముందుకు రాలేని పరిస్దితి. ఎక్కడ దాక్కున్నారో తెలియదన్నారు.
ఇప్పుడు కాపు రిజర్వేషనన్ల కోసం హరిరామజోగయ్య చేపట్టిన దీక్ష విరమణకు పవన్ ప్రయత్నించడాన్ని తప్పుబట్టబోనన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కాపులు ఉద్యమాలు చేస్తే మద్దతివ్వరు, కానీ జగన్ సర్కార్ లో జోగయ్య దీక్ష చేస్తే నేను మద్దతివ్వలేదని తప్పుబడుతున్నారు. ఇదెక్కడి న్యాయమని అంబటి ప్రశ్నించారు. దీనిపై కాపు సోదరులు ఆలోచించాలని అంబటి కోరారు. మరోవైపు కాపు రిజర్వేషన్లపై రాష్ట్రంలో సాగుతున్న పోరుతో వైసీపీలో కాపు నేతలు టార్గెట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అంబటి కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.