ఏపీ మూడు రాజధానులపై వెనక్కు తగ్గలేదు.. ఆగిపోలేదు; ఎవరికీ భయపడేది లేదు: మంత్రి బొత్సా క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులు బిల్లును ఉపసంహరించుకుంటూ తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లును తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్లు వైసీపీ ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా రాజధాని అంశం పైకి మళ్ళాయి.

వికేంద్రీకరణ బిల్లులలో తప్పులు, న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి : బొత్సా
అసెంబ్లీలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల బిల్లు రద్దు నిర్ణయాన్ని ప్రకటించి వికేంద్రీకరణ బిల్లును మరింత మెరుగుపరిచి సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తానని ప్రకటన చేశారు. ఇక ఆ తర్వాత ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వికేంద్రీకరణ బిల్లు ఉపసంహరణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణ బిల్లు లో కొన్ని తప్పులు ఉన్నాయని, కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని దీనిపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేసిందని పేర్కొన్నారు. ఇక వీటిని పరిగణనలోకి తీసుకొని ఎలాంటి చిక్కులు లేకుండా సమగ్రంగా బిల్లులను రూపొందిస్తామని, రాష్ట్ర ప్రజలకు సమగ్రంగా ప్రయోజనాలు అందేందుకు మరోమారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెడతామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం .. వెనక్కు తగ్గేది లేదు
రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు, 13 జిల్లాలు 175 నియోజక వర్గాల వారీగా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని బిల్లును తీసుకొస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇంకా పకడ్బందీగా తమ నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. తాము తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రజలందరి నిర్ణయాలు తీసుకుని మళ్ళీ ముందుకు వస్తామని వెల్లడించారు. గతంలో చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకున్నామని, ఒక్క శాతం కూడా అసంతృప్తి, అపోహలు లేకుండా పకడ్బందీగా రాజధానుల బిల్లును తీసుకువస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అవసరమైతే మరో కమిటీని వేసి సమగ్రంగా బిల్లు రూపొందిస్తామని పేర్కొన్నారు.

గతంలో అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నా: బొత్సా
కానీ తాను ఎవరికీ భయపడేది లేదని, వెనక్కి తగ్గేది లేదని వెల్లడించారు బొత్ససత్యనారాయణ. నాడు మాజీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో పర్యటన చేస్తుంటే ఏముంది ఇక్కడ స్మశానం తప్ప అన్నానని, ఆ మాటకే కట్టుబడి ఉన్నానని బొత్సా సత్యన్నారాయణ పేర్కొన్నారు. బీజేపీకి రాష్ట్రంలో స్థానమే లేదని పేర్కొన్నారు బొత్సా సత్యన్నారాయణ. రోజుకో మాట మాట్లాడుతుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే అంతకుముందే అసెంబ్లీలో త్వరలోనే సమగ్రంగా బిల్లును రూపొందించి మెరుగైన బిల్లును అసెంబ్లీ లో ప్రవేశపెడతామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఏపీలో మూడు రాజధానులపై మళ్ళీ అసెంబ్లీలో జగన్
ఇక ఏపీ మూడు రాజధానుల వ్యవహారంపై మాట్లాడిన సీఎం జగన్ మోహన్ రెడ్డి 1953 నుండి 56 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేదని, ఆ రోజుల్లో గుంటూరులో హైకోర్టు ఉండేదని గుర్తు చేశారు. ఆ తర్వాత 1956 నుండి కర్నూల్ నుంచి రాజధాని, గుంటూరు నుంచి హైకోర్టు నిర్వహించబడేదని, ఇక దానిని హైదరాబాద్ కు తీసుకు వెళ్లారని పేర్కొన్న ఆయన అప్పుడు శ్రీభాగ్ ఒడంబడిక చేసి రాయలసీమకు న్యాయం చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. కానీ రాయలసీమకు న్యాయం జరగలేదని, హైదరాబాద్ రాజధానిగా కొనసాగిన తరువాత ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన క్రమంలో అమరావతిలో రాజధాని పెట్టడానికి దారితీసిన పరిణామాలను జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. నాడు సీఎం చంద్రబాబు శ్రీకృష్ణ కమిటీ నివేదికకు విరుద్ధంగా రాజధాని నిర్ణయం చేశారని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానుల ఏర్పాటు జరిగి తీరుతుందని అసెంబ్లీ వేదికగా జగన్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications