లోకేష్పై ఏపీ మంత్రి సురేష్ సెటైర్-అందరికీ సత్యం రామలింగరాజులు దొరకరుగా...
ఏపీలో పదో తరగతి పరీక్షల రద్దు వివాదం నానాటికీ తీవ్రమవుతోంది. ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి తీరుతామని పదే పదే చెప్తుండగా..పరీక్షల్ని రద్దు చేసి తీరాలని విపక్షాలు రోజురోజుకీ స్వరం పెంచుతున్నాయి. దీంతో ప్రభుత్వం విద్యార్ధులు, తల్లితండ్రుల దృష్టిలో విలన్గా మారిపోతోంది. ఈ నేపథ్యంలో పరీక్షల రద్దు కోరుతున్న విపక్ష టీడీపీ నేత లోకేష్పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల రద్దు కోరుతున్న టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్పై విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల విషయంలో లోకేష్తో పాటు చంద్రబాబు ఎందుకు రాజకీయం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. ఏదో విధంగా పరీక్షలు నిర్వహించి విద్యార్ధులకు గ్రేడ్లు ఇవ్వ్లాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి సురేష్ తెలిపారు. కానీ టీడీపీ నేతలు మాత్రం పరీక్షలు అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.
టీడీపీ నేత లోకేష్ తండ్రికి గతంలో సత్యం రామలింగరాజు దొరికినట్లు అందరు తండ్రులకు దొరకరుగా అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ సెటైర్ వేశారు. లోకేష్ తండ్రికి దొరికినట్లు అందరు తండ్రులకు సత్యం రామలింగరాజులు దొరకరని చెప్పడం ద్వారా గతంలో ఆయన సాయం లేకుండా లోకేష్ విద్యాభ్యాసం పూర్తయ్యేది కాదని సురేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రశ్నాపత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ఓసారి కరోనా తగ్గాక పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.