జగన్ అక్కడ ఓటేసి.. ఇక్కడ మొసలి కన్నీరు: పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఫైర్
ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు చూపిస్తుంది . సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతుంది. ఇక తాజాగా ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన శైలజానాథ్ సీఎం జగన్ బీజేపీకి అనుకూలంగా నాడు పార్లమెంట్ లో పౌరసత్వ బిల్లుకు ఓటేసి ప్రస్తుతం ఇక్కడ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని ఎదిరించగల ఏకైక శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ పేర్కొన్నారు .
సీఎం జగన్ మోహన్ రెడ్డికి దమ్ముంటే తాము ఎన్నార్సీకి తాము వ్యతిరేకమని తీర్మానం చేయాలని సవాలు విసిరారు. ఇక ఏపీ శాసన మండలి రద్దు నిర్ణయాన్ని శైలజానాథ్ తప్పుబట్టారు. పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు గ్రామగ్రామాన పర్యటిస్తామని ఆయన పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే జిల్లాల వారీగా రివ్యూలు చేస్తామని శైలజానాథ్ తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీచేస్తుందని ఆయన పేర్కొన్నారు . అయితే, ఇతర పార్టీలతో పొత్తు వుంటుందా..? లేదా..? అన్నది ఇప్పుడే చెప్పలేమని శైలజానాథ్ అన్నారు. నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీని ఏపీలో పునర్వైభవం తీసుకువెళ్లటం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు వైసీపీ , బీజేపీలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.