ఏపీలో మరో సమ్మె-అసెంబ్లీ సమావేశాల వేళ ఛలో విజయవాడ-టీచర్లు, తాత్కాలిక ఉద్యోగుల జేఏసీ
ఏపీలో పీఆర్సీ ఫిట్ మెంట్ వ్యవహారంలో ఉద్యోగుల సమ్మెను ప్రభుత్వం చివరి నిమిషంలో చర్చలు జరిపి నివారించింది. ఇప్పుడు అదే పీఆర్సీ అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీచర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తమ కార్యాచరణను వారు ప్రకటించారు. ఇందులో దశల వారీగా ఉద్యమం చేపట్టి చివర్లో సమ్మెకు వారు పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వం దీన్ని అడ్డుకునేందుకు ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
ఏపీ పీఆర్సీ రగడ
ఏపీలో పీఆర్సీ వ్యవహారం గత రెండునెలలుగా ఎన్నో మలుపులు తిరిగింది. పీఆర్సీ ఖరారుపై నియమించిన అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బయటికి రాకుండానే ప్రభుత్వం మరో కమిటీని నియమించి వారితో 18 శాతం పీఆర్సీ ఫిట్ మెంట్ కోసం సిఫార్సు చేయించింది. దీంతో ఉద్యోగులు భగ్గు మన్నారు. చివరికి వారితో చర్చలు జరిపి 23 శాతం ఫిట్ మెంట్ ఖరారు చేసినా పీఆర్సీ జీవోల వివాదంతో దానిపై వారు యూటర్న్ తీసుకున్నారు. చివరికి మరోసారి చర్చలు జరిపిన ప్రభుత్వం అంతిమంగా సమ్మెను నివారించింది. కానీ వీరితో విభేదిస్తున్న టీచర్లు, ఇతర ఉద్యోగులు మాత్రం తమ కార్యాచరణ ప్రకటించారు.
మరో సమ్మె సైరన్
పీఆర్సీ ఫిట్ మెంట్ 23 శాతంగానే ఖరారు చేసినా ఉద్యోగులు సమ్మె విరమించడంపై ఆగ్రహంగా ఉన్న టీచర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు తాము మాత్రం పోరు కొనసాగిస్తామని ప్రకటించాయి. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జేఏసీలుగా ఏర్పడి తాజాగా తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి అంటే రేపటి నుంచి జిల్లా సదస్సుల రూపంలో ప్రారంభమయ్యే ఉద్యమ కార్యాచరణ వచ్చే నెలాఖరులో చేపట్టే సమ్మెతో ముగియబోతోంది. దీంతో తాజా పోరుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.
టీచర్లు, తాత్కాలిక ఉద్యోగుల పోరు
టీచర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు చేపట్టే ఈ ఉద్యమం ఏ స్ధాయిలో ఉండబోతోందన్నది ఇఫ్పటికిప్పుడు తేలకపోయినా ఓసారి వారు రంగంలోకి దిగితే మాత్రం క్లారిటీ వచ్చే అవకాశముంది. తాజాగా జేఏసీ ప్రకటించిన కార్యాచరణ ప్రకారం రేపటి నుంచి జిల్లా స్ధాయిలో సదస్సులు ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా 20వ తేదీ వరకూ మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సమర్పిస్తారు. ఈ నెల 28న మంత్రులకు ఈ మెయిల్స్ చేస్తారు. మార్చి 6 న విజయవాడలో నిరసన దీక్షలు చేపడతారు. మార్చి 1 నుంచి 6 వరకూ పట్టణాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు. మార్చి 15 లోపు మండలస్ధాయిలో సమావేశాలు పెట్టుకుని కమిటీలు ఏర్పాటు చేసుకుంటారు.
మరో ఛలో విజయవాడ
అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో ప్రభుత్వానికి నిరసన సెగ తగిలేలా వచ్చే నెలలో టీచర్లు, తాత్కాలిక ఉద్యోగుల జేఏసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా గతంలో నిర్వహించిన ఛలో విజయవాడను రిపీట్ చేయబోతున్నారు. అసెంబ్లీ సమావేశాల వేళ మరోసారి ఛలో విజయవాడ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. అయితే ఇది ఏ రోజు ఉంటుందన్నది ఇంకా నిర్ణయించలేదు. గతంలో ఛలో విజయవాడ సమయంలో ఈ జేఏసీలో ఉన్న వారే కీలకపాత్ర పోషించడంతో అది సక్సెస్ అయింది. ఇప్పుడు మరోసారి ఛలో విజయవాడ నిర్వహించి తమ సత్తా చాటాలని వారు భావిస్తున్నారు.
మార్చి 28, 29న రెండ్రోజుల సమ్మె
పీఆర్సీ ఫిట్ మెంట్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఇతర సమస్యల అజెండాగా వచ్చేనెల 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్త సమ్మె నిర్వహించేందుకు జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు సమ్మెను విజయవంతం చేసేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా కమిటీల ఏర్పాటు, కార్యాచరణ సిద్ధం చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని, వారికి పీఆర్సీ వర్తింపజేయలేదని, కనీసం గతంలో ఇచ్చిన హామీ మేరకు క్రమబద్ధీకరణ కూడా చేయలేదని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రభుత్వంతో తాడోపేడే తేల్చుకుంటామని చెప్తున్నారు.