కరోనా భయాల మధ్యే ఏపీలో స్కూళ్లు పునఃప్రారంభం-సెలవులు పొడిగింపుకు సర్కార్ ససేమిరా
ఏపీలో పాఠశాలలు, విద్యాసంస్ధలు సంక్రాంతి సెలవుల అనంతరం తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్ధులు స్కూళ్ల బాట పట్టారు. సంక్రాంతి సెలవులు నిన్నటితో ముగియగా.. ఇవాళ్టి నుంచి స్కూళ్లు ప్రారంభిస్తారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. అటు తెలంగాణలో స్కూళ్లకు సెలవుల్ని ఈ నెలాఖరు వరకూ పొడిగించడంతో ఏపీలోనూ ప్రభుత్వం అదే నిర్ణయం తీసుకుంటుందని విద్యార్ధులు, తల్లితండ్రులు ఆశించారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం స్కూళ్లను యథావిధిగా తెరవాలని నిర్ణయించడంతో ఆ ఉత్కంఠ తొలగిపోయింది.
ప్రస్తుతం ప్రభుత్వం స్కూళ్లను సాధారణ పద్ధతిలోనే నడుపుతుండగా.. ప్రైవేటు స్కూళ్లు మాత్రం ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో నడుపుతున్నారు. దీంతో స్కూళ్లకు తమ పిల్లల్ని పంపడం ఇష్టం లేని తల్లితండ్రులు.. ఆన్ లైన్ క్లాసులకు వారిని అందుబాటులో ఉంచుతున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం నేరుగా క్లాసులు నిర్వహిస్తుండటంతో పంపాలా వద్దా అనే దానిపై తల్లితండ్రుల్లో సందిగ్ధత నెలకొంది. ఓవైపు కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో తమ పిల్లల్ని స్కూళ్లకు పంపితే కరోనా సోకుతుందేమోనన్న భయాలు వారిని వెంటాడుతున్నాయి.
అయితే ప్రభుత్వం మాత్రం అన్ని కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్తోంది. ముఖ్యంగా కోవిడ్ సోకే ప్రమాదం ఉన్న 9,10 తరగతుల విద్యార్ధుల్లో 15 ఏళ్లు వచ్చిన వారికి ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేయడంతో ఆ మేరకు భయాలు తగ్గాయి. కానీ మిగతా క్లాసుల విద్యార్ధుల విషయంలో మాత్రం తల్లితండ్రుల్లో భయాలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనూ కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఓమిక్రాన్ ప్రభావం కూడా కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని తల్లితండ్రులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం విద్యార్ధుల భవిష్యత్తే తమకు ముఖ్యమని, కోవిడ్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని భరోసా ఇస్తోంది.