వ్యూహం మార్చిన నిమ్మగడ్డ- సంప్రదాయాలకు గుడ్బై - ఏకగ్రీవాలకు చెక్
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఇవాళ మొదలైంది. నామినేషన్ల స్వీకరణతో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. మరోవైపు ప్రభుత్వం ఎస్ఈసీ నిమ్మగడ్డతో యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఓవైపు సహకరిస్తూనే మరోవైపు ఎక్కడికక్కడ కత్తెర్లు వేస్తూ అడుగడుగునా అడ్డుకుంటోంది. దీంతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ నిమ్మగడ్డ కూడా వదులు కోవడం లేదు. తన విచక్షణాధికారాలను పూర్తి స్ధాయిలో వినియోగించుకోవడం ద్వారా సత్తా చాటుకునేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ సిద్ధమయ్యారు. ఇవాళ అనంతపురం వెళ్తున్న నిమ్మగడ్డ ఇకపై వరుస పర్యటనలతో క్షేత్రస్ధాయిలో అక్రమాలకు చెక్ పెట్టనున్నారు.
కేంద్రం చేతుల్లోకి జగన్, నిమ్మగడ్డ పోరు- అభిశంసన, ఉద్యోగుల కొరత- కీలకంగా డీవోపీటీ
ఏకగ్రీవాల చుట్టే పంచాయతీ పోరు
ఏపీలో పేరుకు పంచాయతీ ఎన్నికలే అయినా ఏకగ్రీవాల చుట్టే రాజకీయమంతా సాగుతోంది. ప్రభుత్వం సాధ్యమైనన్ని ఎక్కువ ఏకగ్రీవాలు చేయించాలని మంత్రులకు టార్గెట్ పెడుతుంటే వాటిని అంతే స్ధాయిలో అడ్డుకునేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పుడు ఏకగ్రీవాల కేంద్రంగా ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డగా పంచాయతీ ఎన్నికలు మారిపోయాయి. ఏకగ్రీవాల విషయంలో ముందు నుంచీ సీరియస్గా ఉన్న నిమ్మగడ్డ ఇప్పుడు వాటిని అడ్డుకునేందుకు అమలు చేస్తున్న వ్యూహాలు ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నాయి.
ఏకగ్రీవాల అడ్డుకట్టకు నిమ్మగడ్డ వ్యూహాలు
రాష్ట్రంలో ఏకగ్రీవాల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఇప్పటికే అదనపు డీజీ స్ధాయి అధికారి సంజయ్ను నియమించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఇప్పుడు మరిన్ని వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇందులో భాగంగా వాణీమోహన్ ఉద్వాసనతో ఖాళీగా ఉన్న ఎన్నికల కమిషన్ కార్యదర్శి పదవిని భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. నిమ్మగడ్డ నియమించిన ఐఏఎస్ ముద్దాడ రవిచంద్రకు ప్రభుత్వం మరో బాధ్యత అప్పగించడంతో ఇప్పుడు మరో సీనియర్ ఐఏఎస్ నియామకం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో క్షేత్రస్ధాయిలో పర్యటనలు చేయడం ద్వారా అధికారుల్లో భయం ఉండేలా చూడాలని నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారు.
జిల్లా సమీక్షలతో సర్కారుపై ఒత్తిడి పెంచే వ్యూహం
ఎస్ఈసీ అంటే గతంలో రాష్ట్ర రాజధానిలో ఉంటూ తన పని తాను చేస్తూనే, జిల్లాల్లో అధికారులకు వీడియో కాన్ఫరెన్స్లు, ఫోన్ల ద్వారా ఆదేశాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్ధితి మారింది. విజయవాడలో కూర్చుని జిల్లాల్లో అధికారులకు ఆదేశాలు ఇస్తే వాటి అమలు జరుగుతుందో లేదో తెలియని పరిస్ధితి. దీంతో నేరుగా జిల్లాలకే వెళ్లి సమీక్షలు పెట్టడం ద్వారా అధికారులపై ఒత్తిడి పెంచాలని నిమ్మగడ్డ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ అనంతపురం జిల్లాలో నిమ్మగడ్డ తొలి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఇతర అధికారులనూ రావాలని ఆదేశాలు ఇచ్చారు.
అధికారుల్లో భరోసా నింపేందుకూ వీలు
జిల్లాల్లో పర్యటించి స్ధానికంగా ఉండే కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షలు నిర్వహించడం ద్వారా అధికారులపై ఒత్తిడి ఉంచడమే కాకుండా వారిలో విశ్వాసం నింపేందుకు కూడా వీలవుతుందని నిమ్మగడ్డ భావిస్తున్నారు. ముఖ్యంగా ఏకగ్రీవాలను అడ్డుకోవడంలో అధికారులు సమర్ధంగా పనిచేసేందుకు వీలుగా వారిలో ధీమా నింపాలనేది నిమ్మగడ్డ వ్యూహంగా కనిపిస్తోంది. స్వయంగా ఎన్నికల కమిషనర్ వచ్చి చెప్పాక కూడా ఏకగ్రీవాలకు సహకరిస్తే ఇబ్బందులు తప్పవని జిల్లా అధికారుల్లోనూ భయం ఉంటుంది. దీంతో ఏకగ్రీవాల కోసం జరిగే ప్రయత్నాలకు కొంతమేర అయినా అడ్డుకట్ట పడుతుందనేది ఎస్ఈసీ అంచనాగా కనిపిస్తోంది.
Recommended Video