విశాఖ వెళ్లడంపై ఏపీ ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు- ఒత్తిడి పెంచుతున్న యూనియన్లు..
ఏపీ కొత్త కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నానికి తరలివెళ్లే విషయంలో సచివాలయ ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తరలింపుపై ప్రభుత్వం నుంచి పూర్తి స్ధాయిలో క్లారిటీ రాకపోవడం, ఇతరత్రా కారణాలతో ఉద్యోగుల్లో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం విశాఖకు వెళ్లిపోవడమే మంచిదని ఒత్తిడి పెంచుతున్నాయి.
విశాఖపై సచివాలయ ఉద్యోగుల్లో చీలిక
విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మే నెల నుంచి అక్కడే కార్యకలాపాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలి వెళ్లే విషయంలో మాత్రం ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు మాత్రం మారడం లేదు. ముఖ్యంగా ప్రతీ వారం హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చే ఉద్యోగులు విశాఖ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. అమరావతినే రాజధానిగా నమ్ముకుని అక్కడే ఇళ్లు కట్టుకున్న వారు మాత్రం విశాఖ వెళ్లేందుకు మొగ్గు చూపడం లేదు.
విశాఖపై భిన్నాభిప్రాయాలకు కారణం
అమరావతి నుంచి విశాఖపట్నం వెళ్లే విషయంలో ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలకు కనిపిస్తున్న ప్రధాన కారణం మార్పు. గతంలో హైదరాబాద్ లో ఉద్యోగం, పిల్లల చదువులు ఇతరత్రా వ్యాపకాలకు అలవాటుపడిన వారంతా కొన్నేళ్లుగా అమరావతికి మారిపోయారు. ఇక్కడే ఇల్లు కట్టుకుని, పిల్లలను విజయవాడ లేదా గుంటూరులోని విద్యాసంస్ధల్లో అడ్మిషన్లు తీసుకుని చదివించుకుంటున్నారు. కొందరు మాత్రం హైదరాబాద్ లో ఆస్తులను, ఆప్తులను వదులుకోలేక ఇంకా అక్కడి నుంచే అమరావతికి రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పుడు వీరిలో హైదరాబాద్ లో ఉన్నవారు విశాఖకు వచ్చేందుకు సిద్ధమవుతుండగా.. అమరావతి వాసులు మాత్రం ఇక్కడ ఆస్తులు వదులుకుని మళ్లీ విశాఖ ఎలా వస్తామని ప్రశ్నిస్తున్నారు.
విశాఖ తరలింపుపై ప్రభుత్వ హామీలు
గతంలో హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధానిని తరలించే సమయంలో అప్పటి చంద్రబాబు సర్కారు సచివాలయ ఉద్యోగులకు కొన్ని హామీలు ఇచ్చి, ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. వీటిలో ఐదు రోజుల పనిదినాలతో పాటు ఇళ్లు కట్టుకునేందుకు వీలుగా సులభంగా గృహరుణాలు మంజూరు చేయించింది. అలాగే హైదరాబాద్ నుంచి నిత్యం వచ్చే వారి కోసం కూడా ప్రత్యేక అమరావతి బస్సులను నడుపుతోంది. అలాగే ఇప్పటి జగన్ ప్రభుత్వం కూడా విశాఖకు వచ్చే ఉద్యోగుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించేంందుకు సిద్దమవుతోంది. వీటిలో ఇంటి తరలింపు భత్యంతో పాటు తాత్కాలికంగా ప్రభుత్వ క్వార్టర్స్ కేటాయింపు, పిల్లల అడ్మిషన్లకు సాయం వంటి అంశాలు ఉన్నాయి. అయినా కొందరు ఉద్యోగులు మాత్రం ససేమిరా అంటున్నారు.
ఉద్యోగ సంఘాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి
అమరావతి నుంచి కొత్త రాజధాని విశాఖపట్నానికి తరలి వెళ్లే విషయంలో ఉద్యోగులు ఎలా ఉన్నా ఉద్యోగ సంఘాలు మాత్రం ఉత్సాహంగా ఉన్నాయి. ప్రభుత్వం మనసెరిగి మసలుకునే ఉద్యోగ సంఘాల నేతలు, విశాఖకు ఎప్పుడెప్పుడు వెళతామా అనే ఆలోచనలో ఉన్నారు. అలాగే ఉద్యోగులను కూడా విశాఖకు వెళ్లేందుకు సిద్ధం చేసే పనిలో బిజీగా ఉంటున్నారు. కానీ మొత్తం 2 వేల మంది సచివాలయ ఉద్యోగుల్లో అమరావతిలో ఇళ్లు కట్టుకున్న దాదాపు 600 మంది మినహా మిగతా వారు విశాఖకు సై అంటున్నారు. మిగతా వారిని కూడా ఎలాగోలా ఒప్పించేందుకు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరో నెల రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్ధితుల్లో విశాఖలో వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పించేందుకు సిద్ధమని ఉద్యోగులకు హామీలు కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
అంతిమంగా ప్రభుత్వ నిర్ణయమే..
అమరావతి నుంచి విశాఖకు తరలివెళ్లే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న మే నాటికి ఉద్యోగులంతా ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సిన పరిస్దితి. అయితే వ్రతం చెడ్డా ఫలితం దక్కాలన్న సామెత మేరకు విశాఖ వెళ్లి తీరాల్సిన పరిస్ధితుల్లో తమకు కావాల్సిన వరాలన్నీ పొందాల్సిందేనన్న భావన అంతిమంగా సచివాలయ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.