స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు-అచ్చెన్నాయుడు వెనక్కి-కూనరవిపై చర్యలు-ప్రివిలేజ్ కమిటీ
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూనరవికుమార్ లపై సభా హక్కుల కమిటీ విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాను గతంలో స్పీకర్ తమ్మినేనిపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు అచ్చెన్నాయుడు సభా హక్కుల కమిటీకి చెప్పగా... మరో నేత కూనరవికుమార్ మాత్రం ఉద్ధేశపూర్వకంగా తాను అందుబాటులో లేనని చెప్పినట్లు ప్రివిలేజెస్ కమిటీ అభిప్రాయపడింది. దీంతో ఆయనపై చర్యలకు సిద్ధమవుతోంది.

స్పీకర్ తమ్మినేనిపై అనుచిత వ్యాఖ్యలు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై ఆయన సొంత జిల్లాకే చెందిన టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ ఛీఫ్ కూడా అయిన అచ్చెన్నాయుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూనరవికుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్ తమ్మినేని ఈ వ్యవహారాన్ని అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సభా హక్కుల కమిటీ దీనిపై విచారణ చేపట్టింది. ఇప్పటికే అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై పలుమార్లు విచారణ చేపట్టిన సభా హక్కుల కమిటీ ఇవాళ మరోసారి అసెంబ్లీలో సమావేశమైంది. స్పీకర్ పై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై మరోసారి చర్చించింది.

విచారణకు హాజరైన అచ్చెన్నాయుడు
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఇవాళ ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి ఆయన వ్యక్తిగతంగా హాజరుకావాలని ప్రివిలేజ్ కమిటీ గతంలో కోరింది. గత సమావేశానికి వ్యక్తిగతంగా హాజరుకాకపోవడంతో ఈసారి తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరుకావాలని ప్రివిలేజ్ కమిటీ ఆయనకు సూచించింది. దీంతో అచ్చెన్నాయుడు ఇవాళ అసెంబ్లీకి వచ్చారు. గతంలో స్పీకర్ పై తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీలో ఛైర్మన్, సభ్యులకు వివరణ ఇచ్చారు.

స్పీకర్ పై వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న అచ్చెన్నాయుడు
స్పీకర్ పై గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సభ్యులకు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఇవాళ వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన చెప్పినట్లు కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. తాను ప్రెస్నోట్ ఆఫీసులో పెడితే.. తన సంతకం లేకుండానే రిలీజ్ అయిందని, పొరపాటు జరిగిందని అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేసినట్లు కాకాణి తెలిపారు. ఈ విషయాన్ని తాను పొడిగించదల్చుకోలేదని.. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని అచ్చెన్న చెప్పారన్నారు. దీంతో ఆయన వివరణను మిగతా సభ్యులకు పంపాలని కాకాణి నిర్ణయించారు.

కూనపై ప్రివిలేజ్ కమిటీ చర్యలు ?
అయితే స్పీకర్ తమ్మినేనిపై అనుచిత వ్యాఖ్యల కేసులో మరో నిందితుడుగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మాత్రం ఈ సమావేశానికి హాజరు కాలేదు. అంతే కాదు తాను అందుబాటులో లేనని సమాచారం కూడా ఇచ్చారు. కానీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మాత్రం ఆయన అందుబాటులో ఉండి కూడా రాలేదనే నిర్ధారణకు వచ్చింది. దీంతో కూన రవికుమార్ పై చర్యలకు సిఫార్సు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నోటీసు తీసుకునే సమయంలో కూన రవి కుమార్ అందుబాటులో లేనని చెప్పారని కమిటీ ఛైర్మన్ కాకాణి తెలిపారు. కూన రవి అందుబాటులో ఉన్నారో లేరో అనే అంశంపై విచారణ జరుపుతున్నామని కాకాణి వెల్లడించారు. దీంతో విచారణలో ఆయన కావాలనే అలా చేశారని భావిస్తే మాత్రం చర్యలు తప్పేలా లేవు.












Click it and Unblock the Notifications