అప్పుడు మట్టి, ఇప్పుడు సున్నం.. మోడీ టూర్ పై షర్మిల సెటైర్లు..!
అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి వస్తున్న ప్రధాని మోడీపై పీసీసీ ఛీఫ్ ముందస్తుగా నిప్పులు చెరిగారు. గతంలో చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చిపోయారంటూ మొదలుపెట్టి వరుసగా విమర్శలు గుప్పించారు. ఇదే అమరావతికి ప్రధాని మోడీ గారు చేసిన సహాయం అన్నారు. ఈ మేరకు ఎక్స్ లో సుదీర్ఘంగా ట్వీట్ చేశారు. ఆనాడు గాలి మోటార్లో తిరిగి ఆంధ్రుల నెత్తి మీద మట్టి కొట్టారని, ఇప్పుడు మళ్ళీ సున్నం కొట్టడానికి వస్తున్నారన్నారు.
చివరికి ఆత్మగౌరవం అమరావతిని "మోడీ శంకుస్థాపనల ప్రాజెక్ట్ " కింద మార్చేశారని షర్మిల విమర్శించారు. రాజధాని నిర్మాణంపై బీజేపీ చేస్తున్నది ఘరానా మోసమని, రాష్ట్రానికి చేసింది ద్రోహమని తెలిపారు. పోలవరం ఎత్తు తగ్గించి తీరని అన్యాయం చేసి, రూ.15వేల కోట్లు అప్పు ఇచ్చి రాజధానిని ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పడం సిగ్గుచేటన్నారు. నిజంగా అమరావతిపై మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే 9 ఏళ్లు గాడిదలు కాశారా అని ప్రశ్నించారు.

రాజధాని పనులపై ఒక్కనాడైనా బాధ్యతగా అడిగారా ?, ఒక్క రూపాయి నిధులైనా అమరావతికి కేటాయించారా ?, త్రీడీ గ్రాఫిక్స్ అమలు సంగతేంటని చంద్రబాబును ప్రశ్నించారా ?, గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతుంటే వేడుక చూసింది మీరు కాదా ? ఇది తప్పని మీ దత్తపుత్రుడిని ఎందుకు వారించలేదు ?, అమరావతి రైతుల ఉద్యమం ఢీల్లీ దాకా పాకితే కనీసం స్పందించలేదు ఎందుకు ?, ఢీల్లీనీ మించిన రాజధాని కట్టిస్తామని ఇచ్చిన హామీ మరిచిపోయారా ? అంటూ షర్మిల వరుసగా ప్రశ్నలు సంధించారు.
చెంబేడు నీళ్ళు, గుప్పెడు మట్టి ఇదే అమరావతికి ప్రధాని మోడీ @narendramodi గారు చేసిన సహాయం. ఆనాడు గాలి మోటార్లో తిరిగి ఆంధ్రుల నెత్తి మీద మట్టి కొట్టారు. ఇప్పుడు మళ్ళీ సున్నం కొట్టడానికి వస్తున్నారు. చివరికి ఆత్మగౌరవం అమరావతిని "మోడీ శంకుస్థాపనల ప్రాజెక్ట్ " కింద మార్చేశారు.…
— YS Sharmila (@realyssharmila) April 17, 2025
ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేసి ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని రాజధాని శంకుస్థాపనకు వస్తున్నారో మోడీ గారు సమాధానం చెప్పాలన్నారు. 10 ఏళ్లు దాటినా రాష్ట్రానికి రాజధాని లేదంటే.. ఇందుకు ప్రధాన ముద్దాయి ఏ1 మోడీ అన్నారు. ఏ2 చంద్రబాబు, ఏ3 జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వచ్చే నెల 2న అమరావతి పనుల పునఃప్రారంభానికి వస్తున్న ప్రధాని మోడీని ఏపీ కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల పలు డిమాండ్లు చేశారు.
ఏపీ నూతన రాజధాని నిర్మాణం విభజన హామీలో ఒకటి, కేంద్రమే పూర్తి నిధులతో నిర్మించాల్సిన ప్రాజెక్ట్ అన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతికి పూర్తి స్థాయి నిధులు ప్రకటన చేయాలని కోరారు. 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంటు సెయిల్ లో విలీనంతో పాటు, కడప స్టీల్,వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు లాంటి పెండింగ్ విభజన హామీలపై మీ వైఖరి తేల్చాలన్నారు. పోలవరం ఎత్తు 45 మీటర్లా ? లేక 41 మీటర్లకే పరిమితమా ? మోడీ క్లారిటీ ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications