కరోనాతో మరో సెక్రటేరియట్ ఉద్యోగి మృతి, జగన్ కు పట్టదా, వర్క్ ఫ్రమ్ హోం డిమాండ్ చేసిన అచ్చెన్న!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ముఖ్యంగా అమరావతిలోని ఏపీ సచివాలయంలో కరోనా కలకలం రేపుతుంది. ఏపీ సచివాలయ ఉద్యోగుల జీవితాలలో కరోనా మరణ ఘంటికలు మోగిస్తోంది. తాజాగా ఏపీ సచివాలయంలో మరో ఉద్యోగి కరోనాతో మృతిచెందిన ఘటన ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతుంది. తాజా పరిస్థితులతో సచివాలయ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అవలంబించాలని, వారి ప్రాణాలను కరోనా మహమ్మారి బారినుండి రక్షించాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేస్తున్నారు.

ఏపీ సచివాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్న కిషోర్ కుమార్ మృతి
అమరావతిలోని ఏపీ సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్న కిషోర్ కుమార్ అనే ఉద్యోగి కరోనాతో కన్నుమూశారు. దీంతో కరోనా మహమ్మారికి బలైపోయిన సచివాలయ ఉద్యోగుల సంఖ్య ఆరుకు పెరిగింది. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు కరోనా మహమ్మారి దెబ్బకు బెంబేలెత్తిపోతుంటే తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఐ ఎన్ మూర్తి, పద్మారావు, రవికాంత్, శాంతకుమారి, శ్రీనివాస్ అనే సచివాలయ ఉద్యోగులు కరోనాకు బలి కాగా తాజాగా కిషోర్ కుమార్ కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయాడు.

వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని డిమాండ్ .. జగన్ పై అచ్చెన్న ఫైర్
ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగులు తమకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.కరోనా మహమ్మారి కార్యాలయాలలో విజృంభిస్తున్న నేపథ్యంలో కార్యాలయానికి వచ్చి పని చేయడానికి ఉద్యోగులు వెనకడుగు వేస్తున్నారు. ఇదే సమయంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కరోనా బారినపడి సచివాలయ ఉద్యోగులు మరణిస్తున్నా జగన్ కు పట్టడం లేదని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఉద్యోగుల భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్న అచ్చెన్న ..పరిహారం డిమాండ్
సచివాలయ ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పని చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇంత మంది కరోనా కారణంగా ఉద్యోగులు మృతి చెందుతున్నా జగన్ రెడ్డికి పట్టడంలేదని విమర్శించారు. వందలాది మంది ఉద్యోగులకు కరోనా సోకిందని తెలిపిన అచ్చెన్న ఉద్యోగుల భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆక్షేపించారు. సచివాలయ ఉద్యోగులు అందరికీ వర్క్ ఫ్రం హోం కల్పించాలని,కరోనా కారణంగా మృతి చెందిన కుటుంబాలకు పరిహారం చెల్లించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications