‘బాహుబలి2’ని వాడేస్తున్నారిలా: సూరత్ నుంచి ఏపీ, టీతోపాటు దేశ వ్యాప్తంగా!
సూరత్/విశాఖపట్నం: తెలుగు ప్రేక్షకులతోపాటు దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన బాహుబలి 2 చిత్రం శుక్రవారం విడుదలైంది. కాగా, ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ను వ్యాపార, వాణిజ్య సంస్థలు ఎంతవరకు వాడుకోవాలో అంతవరకూ వాడేస్తున్నాయి. ఇప్పటికే బాహుబలిని ఉపయోగించుకుంటూ పలు ప్రకటనలు బుల్లితెర, వెండితెరలపై ఆకట్టుకుంటున్నాయి.
మహిళా అభిమానులకు వల
తాజాగా, మహిళా అభిమానులను కూడా ఆకట్టుకునేందుకు వ్యాపార సంస్థలు మరో ముందడుగు వేశాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పుడు బాహుబలి-2 చీరలు సందడి చేస్తున్నాయి. మహిళలను అమితంగా ఆకట్టుకునే విధంగా ఈ చీరలను రూపొందించడం గమనార్హం.
మహిళల ఆసక్తి
చీరలపై బాహుబలి 2 చిత్రం పోస్టర్లను ముద్రించి అమ్మకాలు చేపడుతున్నారు. ఇప్పటికే విశాఖపట్నంలోని సీఎంఆర్ సెంట్రల్లో బాహుబలి చీరల అమ్మకాలను చేపట్టారు. మహిళలు కూడా ఈ చీరలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.
సూరత్లోనే ప్రింటింగ్..
ఇది ఇలా ఉండగా, వస్త్ర పరిశ్రమకు పేరుగాంచిన సూరత్లోనూ బాహుబలి చీరలను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. బాహుబలి 2 పోస్టర్లను డిజిటల్ ప్రింటింగ్ చేసి ఆకర్షణీయంగా ఈ చీరలను రూపొందిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలతోపాటు..
భారీ ఎత్తున తయారు చేసిన 2వేలకు పౌగా ఈ చీరలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు పంపించినట్లు సూరత్ వస్త్ర వ్యాపారి కమలేశ్ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు కూడా పంపిస్తామని చెప్పారు.
భారీ అంచనాలు
ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి 2 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 8వేలకుపైగా థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశ వ్యాప్తంగా అభిమానుల్లో బాహుబలి2 చిత్రంపై భారీ అంచనాలున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఒక్క టికెట్కు రూ.2వేలు వెచ్చించేందుకు వెనుకాడకపోవడం విశేషం. బాహుబలి మొదటి భాగం భారీ హిట్ అయిన విషయం తెలిసిందే.