ఏపీలో మళ్లీ ఆ ఉద్యమాలు? కూటమి నిర్ణయాలతో చాపకింద నీరులా..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఎనిమిది నెలలవుతోంది. ఈ ఎనిమిది నెలల్లో ప్రభుత్వం ఫోకస్ పెట్టిన రెండే విషయాలు అమరావతి, పోలవరం ప్రాజెక్టు. ఏపీలో ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం ప్రాజెక్టు అంటూ సీఎం చంద్రబాబే స్వయంగా పలుమార్లు ప్రకటించారు. దీంతో మిగతా అంశాల సంగతేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విభజన హామీల్లో మిగిలిన వాటిని ఎలా వదిలేస్తారంటూ పాత డిమాండ్లే కొత్తగా వినిపిస్తున్నాయి.
తాజాగా పోలవరం నీటి నిల్వ 41.15 అడుగులకు కుదించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి సమావేశం ఏర్పాటు చేసింది. ఏపీకి చెందిన కూటమి ఎంపీలు పోలవరం ఎత్తు తగ్గించకుండా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నేతలు వీవీ లక్ష్మీ నారాయణ, చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సహా ఇతర విభజన హమీలపై కేంద్రం నోరు మెదపకపోయినా ఏపీలో అధికార పార్టీలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పరిస్ధితి ఇలాగే ఉంటే రోడ్లపైకి వచ్చి పోరాడేందుకు సిద్దమని స్పష్టం చేశారు.

మరోవైపు ఇవాళ విజయవాడలో పలు రాజకీయ పార్టీలు,విద్యార్థి ,యువజన, కార్మిక , రైతు సంఘాల ప్రతినిధులు సమావేశం అయ్యారు. విజయవాడ ఐలాపురం హోటల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోరుతూ అఖిలపక్ష నేతల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆంద్రప్రదేశ్ అంటే అమరావతి , పోలవరం మాత్రమే కాదని, వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ , ఉత్తరాంధ్ర కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో రానున్న ఏపీ బడ్జెట్ లో నిధులు కేటాయించేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అఖిలపక్ష నాయకులు సిద్ధమవుతున్నారు.
ఇలా విభజన హామీల అమలుపై కూటమి పార్టీలు అనుసరిస్తున్న తీరుపై ఎక్కడిక్కడ ఉద్యమాలు ఊపిరి పోసుకుంటున్నాయి. సరిగ్గా ఇలాంటి పరిస్దితులనే గమనించి గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొమ్ము చేసుకున్నారు. చివరికి వీటితోనే గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి దూరం చేశారు. చివరికి బీజేపీపైనే చంద్రబాబు పోరాటం చేసి ఓడిపోతే.. జగన్ రాజకీయంగా భారీ లబ్ది పొందారు. ఏపీలో భారీ మెజార్టీతో 2019లో అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఇలాంటి ఉద్యమాలను ఆరంభ దశలోనే గమనించి పరిష్కారం కోసం ప్రభుత్వాలు ప్రయత్నించాలనే చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications