జగన్ కోటకు బీటలు: టిడిపిలో చేరిన బద్వేల్ ఎమ్మెల్యే, భస్మాసురుడు..
విజయవాడ: వైసిపి అధ్యక్షులు జగన్కు బద్వేలు ఎమ్మెల్యే జయరాములు బుధవారం నాడు షాకిచ్చారు. ఆయన చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా బొండ ఉమ మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాల్లోపు వైసిపికి చెందిన ఎమ్మెల్యేలు మరింత మంది వస్తారన్నారు.
కడప జిల్లా బద్వేలు శాసన సభ నియోజకవర్గ ఎమ్మెల్యే జయరాములు టిడిపిలో చేరారని బొండా ఉమ చెప్పారు. జగన్ ప్రభుత్వాన్ని పడగొడతామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని ధ్వజమెత్తారు. ఇంకా చాలామంది వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలోకి వస్తారని చెప్పారు. వైసిపిలో జగన్ ఒక్కడే మిగులుతాడన్నారు.
బ్రేకింగ్ న్యూస్ అలర్ట్, నేటి వార్తాశీర్షికలను మీ ఇన్బాక్స్లో పొందండి
బడ్జెట్ సమావేశాలలోపే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కడం ఖాయమని చెప్పారు. జగన్ అభివృద్ధి నిరోదకుడు అని మండిపడ్డారు. చంద్రబాబు నేతృత్వంలో పని చేసేందుకు జయరాములు టిడిపిలోకి వచ్చారని, చంద్రబాబు సమక్షంలో ఆయన టిడిపి కండువా కప్పుకున్నారన్నారు. మరోవైపు, ఉప ఎన్నికల పైన బొండ ఉమ నీళ్లు నమిలారు. ఉప ఎన్నికలకు అభివృద్ధికి ఏం సంబంధమని చెప్పారు. అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని చెప్పారు.
బద్వేల్ నియోజకవర్గం కడప జిల్లాలోనే అత్యంత వెనుకబడిందని ఎమ్మెల్యే జయరాములు అన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని చెప్పారు. దళితుల పట్ల జరుగుతున్న ఘోరాలు, నేరాలను చంద్రబాబు ఆపుతున్నారని, అందర్నీ సమానంగా చూస్తామని బాబు మాట ఇచ్చారన్నారు.
చంద్రబాబు హామీ మేరకు తాను టిడిపిలో చేరానని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారని, లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు పని చేస్తున్నారని చెప్పారు. బద్వేలు అభివృద్ధికి చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు.
తాను ప్రలోభాలకులోను కాలేదని, అభివృద్ధికి ఆకర్షితుడినయ్యానని చెప్పారు. బద్వేలు నియోజకవర్గం, రాయలసీమ అభివృద్ధి తన బాధ్యత అని చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని చెప్పారు. అవసరమైతే రాజీనామా చేసి తిరిగి గెలుస్తామని చెప్పారు.
చంద్రబాబు పరిపాలన, దళితుల అభివృద్ధి - సంక్షేమం కోసం చూసి వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని జూపూడి ప్రభాకర రావు చెప్పారు. దళితుల అభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తున్నారని, అందుకే ఎమ్మెల్యేలు ఆకర్షితులవుతున్నారని చెప్పారు.
జగన్కు రాజకీయ పరిపక్వత లేదన్నారు. అలాంటి జగన్ ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పడం విడ్డూరమన్నారు. తమతో 21 మంది టిడిపి ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పడం విడ్డూరమన్నారు. టచ్లో ఉండేందుకు ఇదేమీ సెల్ ఫోన్ కాదని ఎద్దేవా చేశారు.
పురాణాల్లో మనం భస్మాసురుడి గురించి విన్నామని, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జగన్ భస్మాసురుడి పాత్రను నిర్వహిస్తున్నారని పయ్యావుల కేశవ్ అన్నారు. జగన్కు జగనే శత్రువని టిడిపిలో చేరుతున్న వైసిపి ఎమ్మెల్యేల ద్వారా అర్థమవుతోందన్నారు.
ఈ ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్ చెప్పారని, ఈ వ్యాఖ్యల పట్ల వైసిపి ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తికి లోనయ్యారని, జగన్ వ్యాఖ్యల కారణంగానే వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని చెప్పారు. 2004లో వైయస్ రాజశేఖర రెడ్డి ఏం చేశారో అందరికీ తెలుసునని చెప్పారు.
అప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను వైయస్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారన్నారు. అప్పుడు జగన్కు రాజ్యాంగం, చట్టం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో కూడా వైసిపి తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారని, అందులో ఇద్దరు తెరాసలో చేరితే జగన్ ఎందుకు మాట్లాడలేదన్నారు.
ఇద్దరు చేరితో ఒకరు ఫ్రీ అన్నట్లు.. తెలంగాణలో మూడో ఎమ్మెల్యే కూడా తెరాసకు ఓటు వేయించారని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది వైయస్సేనని, ఇప్పుడు తెలంగాణలో కెసిఆర్తో కుమ్మక్కయిందే వైసిపి అధినేత జగన్ అన్నారు. తెరాస సభ్యులను కాంగ్రెస్లో చేర్చుకున్నప్పుడు జగన్ ఎందుకు మాట్లాడలేదన్నారు.
జగన్ ప్రభుత్వాన్ని పడగొడతానని మాట్లాడటం విడ్డూరమన్నారు. ఆయన నిత్యం అబద్దాలు, అసత్యాలు మాట్లాడుతారన్నారు. ఇప్పుడు టిడిపిలోకి చేరికలను వ్యతిరేకిస్తూనే మరోవైపు, మూడేళ్లు అయిపోయేసరికి వారు నా వైపు వస్తారని చెప్పడం విడ్డూరమన్నారు. ప్రజా సంక్షేమం కోసం నేతలు చేరుతున్నారన్నారు.
వైసిపి మొత్తం ఖాళీ: దేవినేని
మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపిలోకి చేరికలు కేవలం ప్రారంభం మాత్రమేనన్నారు. త్వరలోనే జగన్ మినహా వైసిపి మొత్తాన్ని ఖాళీ చేస్తామన్నారు.