పోలీసులపైనే పోలీసులకు భూమా అఖిలప్రియ ఫిర్యాదు .. బోయినపల్లి కిడ్నాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్ !!
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ టీడీపీ అధికారం కోల్పోయిన తరువాత నుండి అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా భూమా అఖిలప్రియ పోలీసులపైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఘటన అందరినీ ఒక్క సారిగా షాక్ కు గురిచేసింది. బోయినపల్లి పోలీసులపై భూమా అఖిలప్రియ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కూకట్ పల్లిలోని తన ఇంట్లో పలు విలువైన పత్రాలతో పాటుగా, కొన్ని వస్తువులని బోయినపల్లి పోలీసులు ఎత్తుకెళ్లారు అని భూమా అఖిలప్రియ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆమె బోయినపల్లి పోలీసులపై తన ఇంట్లో చోరీ చేశారంటూ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
భార్గవ్ రామ్, ఆయన తమ్ముడిపై పెట్టినవి తప్పుడు కేసులు, వారిపై కోర్టుకెళ్తా : భూమా అఖిల ప్రియ
ఇంట్లో విలువైన పత్రాలు, వస్తువులు చోరీ చేశారని ఫిర్యాదు
ఇక ఫిర్యాదులో భూమా అఖిలప్రియ తాను ఇంట్లో లేని సమయంలో తన ఇంట్లోకి కొంతమంది వ్యక్తులు వచ్చారని పేర్కొన్నారు. బోయినపల్లి పోలీసులతో పాటుగా పది మంది వరకూ తన ఇంట్లోకి చొరబడ్డారని, వారు తన ఆస్తులకు సంబంధించిన అత్యంత విలువైన పత్రాలతో పాటుగా, తన తండ్రికి సంబందించిన కొన్ని వస్తువులను కూడా ఎత్తుకు పోయారని ఆమె పేర్కొన్నారు. దీనికి సంబంధించి కొన్ని సీసీటీవీ ఫుటేజీలను, ఫోటోలను, వీడియోలను కూడా ఆమె పోలీసులకు ఇచ్చినట్లుగా సమాచారం.
పోలీసులపైనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు .. షాకింగ్ పరిణామం
బోయినపల్లి ప్రదీప్ రావు సోదరుల కిడ్నాప్ వ్యవహారంలో భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, అతని సోదరుడు జగద్విఖ్యాత రెడ్డిల పైన, అలాగే భూమా అఖిలప్రియ, ఆమె అనుచరులపైన పోలీస్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. బోయినపల్లి పోలీసులు భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసిన వ్యవహారం కూడా అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది . ఇక తాజాగా భూమా అఖిలప్రియ తాను ఇంట్లో లేని సమయంలో పోలీసులతో పాటు కొందరు వచ్చి తన ఇంట్లో చోరీకి పాల్పడ్డారని బోయినపల్లి పోలీసులను టార్గెట్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం షాకింగ్ పరిణామం .
కేసీఆర్ సమీప బంధువు ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసు
ఇక బోయినపల్లి సోదరులు కిడ్నాప్ కేసు వ్యవహారానికి వస్తే కెసిఆర్ సమీప బంధువులైన ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసిన వ్యవహారంలో భూమా అఖిలప్రియ మెడకు కేసు చుట్టుకుంది. హఫీజ్ పేటలోని 50 ఎకరాల భూ వ్యవహారమే కిడ్నాప్ కు కారణమని అప్పట్లో చర్చ జరిగింది. భూమా నాగిరెడ్డి హయం నుండి వారి మధ్య భూ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, అతని సోదరుడు జగద్విఖ్యాత రెడ్డి భూ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ప్రవీణ్ రావు సోదరులు సెటిల్మెంటుకు ససేమిరా అనడంతో రెక్కీ నిర్వహించి మరి సినీఫక్కీలో కిడ్నాప్ చేశారు.
సినీ ఫక్కీలో బోయినపల్లి సోదరుల కిడ్నాప్
ఐటి అధికారుల పేరుతో సోదాలు నిర్వహించి, ఇంట్లో ఉన్న వారందరినీ ఓ గదిలో బంధించి, ప్రవీణ్ రావు ముగ్గురు సోదరులను కార్లలో ఎక్కించి తీసుకు వెళ్లారు. పక్కా ప్లాన్ తో స్కెచ్ వేసి మరీ కిడ్నాప్ కు పాల్పడినా సిసిటివి ఫుటేజీ ఆధారంగా హైదరాబాద్ నగర శివార్లలో దాటకముందే నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఇక ఈ వ్యవహారంలో ఏపీ మాజీమంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్, ఆయన సోదరుడు జగద్విఖ్యాత రెడ్డి తో పాటుగా 15 మంది నిందితులు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
భూమా అఖిలప్రియ మెడకు కిడ్నాప్ కేసు.. బోయినపల్లి పోలీసుల అరెస్ట్ .. కొనసాగుతున్న రగడ
బోయినపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి భూమా అఖిలప్రియ ను కూడా అరెస్ట్ చేసి కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియను జైలుకు పంపించారు. అంతకుముందు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా అఖిలప్రియ కు, టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి కి మధ్య వివాదాలు చోటు చేసుకున్న క్రమంలో అప్పట్లో అది చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ఇటీవల ఈ కేసులో కోర్టుకు భార్గవ్ రామ్, ఆయన సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా వారు ఫేక్ కరోనా సర్టిఫికెట్లు పెట్టి కేసుకు హాజరుకాకుండా కోర్టును మోసం చేశారని బోయినపల్లి పోలీసులు మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
అఖిల ప్రియ భర్త, అతని సోదరుడిపై నకిలీ సర్టిఫికెట్ కేసు పెట్టిన బోయినపల్లి పోలీసులు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయినపల్లి సోదరుల కిడ్నాప్ కేసులో నిందితులుగా ఉన్న భార్గవ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలు ఈ నెల 3వ తేదీన కోర్టులో హాజరు కావాల్సి ఉండగా, కోర్టుకు హాజరు కాకుండా ఉండడానికి వారు కరోనా బారిన పడ్డట్టుగా ఈ నెల 1వ తేదీన సర్టిఫికెట్లు సమర్పించారు. కరోనా కారణంగా కోర్టుకు హాజరు కాలేమని వారిరువురు అందులో పేర్కొన్నారు.అయితే వారు కోర్టుకు సమర్పించిన కోవిడ్ సర్టిఫికెట్లు తప్పని, అవి నకిలీవని తేల్చిన బోయినపల్లి పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. విచారణ నుండి తప్పించుకోవడం కోసమే వారు నకిలీ సర్టిఫికెట్లను కోర్టుకు సమర్పించారని పోలీసులు తేల్చారు.
కొనసాగుతున్న కిడ్నాప్ కేసులో ట్విస్ట్ లు.. ఇప్పుడు పోలీసులనే టార్గెట్ చేసిన భూమా అఖిల
దీంతో నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన ఆసుపత్రి సిబ్బంది వినయ్,రత్నాకర్, శ్రీదేవి లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ వ్యవహారంపై కూడా సదరు ల్యాబ్ పై తాము కోర్టుకు వెళ్తామని అఖిల ప్రియ పేర్కొన్నారు. ఇప్పుడు బోయినపల్లి పోలీసులపై ఫిర్యాదుతో మరో వివాదం మొదలైంది. ఏదిఏమైనా వరుస వివాదాలతో భూమా అఖిలప్రియ పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న వేళ పోలీసుల పైన భూమా అఖిలప్రియ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఎలాంటి పరిణామాలకు కారణం అవుతుందో అన్న ఉత్కంఠ సర్వత్రా కొనసాగుతుంది.