Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ఊరట- ఆ కేసు కొట్టేసిన ఏపీ హైకోర్టు...
ఏపీ రాజకీయాల నుంచి చిరంజీవి దాదాపు పదేళ్ల క్రితమే విరమించుకున్నా ఇప్పటికీ ఎక్కడో చోట ఆయన పేరు వినిపిస్తూనే ఉంది. రెండేళ్ల క్రితం కరోనా సమయంలో ఏపీలో టాలీవుడ్ షూటింగ్స్ కు సంబంధించి అనుమతులు ఇవ్వాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన చిరంజీవి.. ఆ తర్వాత పలుమార్లు అమరావతికి వచ్చారు. అయితే రాజకీయంగా మాత్రం తన సోదరుడు పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటానని స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత మాత్రం హైదరాబాద్ కే పరిమితమవుతున్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల వరకూ చిరంజీవి రాజకీయంగా యాక్టివ్ గానే ఉన్నారు. ఆ సమయంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నికై, ఆ తర్వాత కేంద్రమంత్రి కూడా అయిన చిరంజీవిని 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఆశల్లేని పరిస్దితుల్లో స్టార్ క్యాంపెయినర్ గా ఎంపిక చేసి పంపింది. అయితే అదే సమయంలో గుంటూరులో ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై చిరంజీవిపై కేసు నమోదైంది.

2014 ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిచారని గుంటూరులో మెగాస్టార్ చిరంజీవి పై పెట్టిన కేసును హైకోర్టు ఇవాళ కొట్టేసింది. అప్పట్లో గుంటూరు పోలీసులు ఎన్నికల ప్రచారం సందర్భంగా చిరంజీవి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేసు పెట్టారు. కానీ ప్రాసిక్యూషన్ దీన్ని హైకోర్టులో నిరూపించలేకపోవడంతో కేసు కొట్టేస్తున్నట్లు రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం ప్రకటించింది. దీంతో చిరంజీవికి ఆ పాత ఎన్నికల కేసు నుంచి ఊరట లభించింది.
ప్రస్తుతం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ సినిమాలకే పరిమితం అవుతున్న చిరంజీవికి ఈ కేసు కొనసాగింపు ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి తరుణంలో హైకోర్టు కేసు కొట్టేస్తూ ఇచ్చిన ఆదేశాలు ఊరటనిచ్చాయనే చెప్పుకోవచ్చు. అయితే చిరు మాత్రం తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో జనసేన తరఫున పోరాడుతున్న తన సోదరుడు పవన్ కు మాత్రమే అండగా నిలవబోతున్నారు.












Click it and Unblock the Notifications