మూడు రాజధానుల ర్యాలీలో సీఎం పవర్ స్టార్ నినాదాలు-వైసీపీ నేతలకు షాక్ !
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల్ని అమల్లోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాజాగా విశాఖలో మూడు రాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ విశాఖ గర్జన కూడా నిర్వహించింది. ఆ తర్వాత ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఇలాంటి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో ఇవాళ జరిగిన మూడు రాజధానుల ర్యాలీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
అనకాపల్లి జిల్లా చోడవరంలో నాన్-పొలిటికల్ జేఏసీ సాయంతో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఇతర నేతలతో కలిసి వికేంద్రీకరణకు అనుకూలంగా విద్యార్ధి భేరీ ర్యాలీ ఏర్పాటు చేశారు. మూడు రాజధానులే కావాలని విద్యార్ధులతో నినాదాలు చేయించారు. అయితే కాసేపు నినాదాలు చేసిన విద్యార్ధులు.. ఆ తర్వాత విసుగెత్తి పవన్ కళ్యాణ్ అనుకూల నినాదాలు చేయడం మొదలుపెట్టారు. సీఎం పవర్ స్టార్ అంటూ విద్యార్ధులు నినాదాలు చేశారు. దీంతో అక్కడికి వచ్చిన వైసీపీ నేతలు అవాక్కయ్యారు.
ర్యాలీకి భారీ ఎత్తున విద్యార్ధుల్ని తరలించిన వైసీపీ నేతలకు వారి పవన్ కళ్యాణ్ నినాదాలతో దిమ్మ తిరిగింది. అయితే అప్పటికే ర్యాలీకి భారీ ఎత్తున విద్యార్ధులు రావడం, వారిని నిలువరించే పరిస్ధితి లేకపోవడంతో చేసేది లేక వైసీపీ నేతలు మిన్నకుండిపోయారు. ఇదే అదనుగా విద్యార్ధులు మరింత పెద్ద గొంతుతో పవన్ అనుకూల నినాదాలు చేశారు. అలాగే ర్యాలీ ముందుకు సాగింది. దీంతో వైసీపీ నేతలు స్ధానిక నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.