తీగల రాజీనామాకు పట్టు, సీపీఐ రామకృష్ణకు జైలు శిక్ష
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ టికెట్ పైన మహేశ్వరం నియోజకవర్గం నుండి శాసన సభ్యుడిగా గెలిచిన తీగల కృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసిన తర్వాతే పార్టీ మారాలని సరూర్ నగర్ భారతీయ జనతా పార్టీ నేతలు డిమాండ్ చేశారు. తీగల తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు బుధవారం ఆయన దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు.
ఎల్బీ నగర్ మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ కొత్తపేట కూడలి వరకు సాగింది. ఇందులో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. చావు డప్పులతో ర్యాలీ నిర్వహించారు. తీగల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీగల దగాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని, తన నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని నినాదాలు చేశారు.
స్వలాభం కోసం, తన మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం తెరాసలో చేరడానికి తీగల సంసిద్ధులయ్యారని ఆరోపించారు. బంగారు తెలంగాణ కోసం ఏమాత్రం కాదని, కేసీఆర్ అంటే భయంతోనే కారు ఎక్కుతున్నారన్నారు.
తీగల తన పదవికి రాజీనామా చేసి, తెరాసలో చేరి తిరిగి పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు, బీజేపీ, టీడీపీలకే ఓట్లు వేశారన్నారు. వెంటనే ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. లేని పక్షంలో ఆయన కార్యక్రమాలను తాము అడ్డుకుంటామని, ఆందోళన చేస్తామన్నారు.
సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు ఆర్నెల్ల జైలు
సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి రామకృష్ణకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది.
రామకృష్ణతో పాటు ఆ పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, రైతు సంఘం నేత విశ్వేశ్వర రావులకు కూడా ఇదే జైలు శిక్ష ఖరారు చేస్తూ వరంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది. 2012లో వరంగల్ మార్కెట్ యార్డులో జరిగిన ధర్నాకు సంబంధించి పోలీసులు 12 మందిపై కేసులు నమోదు చేసింది. వారిలో ఆరుగురికి కోర్టు శిక్ష ఖరారు చేసింది.
సీపీఐ ఆఫీసులో జాతీయ కార్యవర్గం భేటీ
సీపీఐ కార్యాలయంలో జాతీయ కార్యవర్గం బుధవారం సమావేశమైంది. పార్టీ మహాసభలు, కమ్యూనిస్టుల ఐక్యపోరాటాలపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సురవరం, బర్దన్, రాజా, నారాయణ ఈ సమావేశానికి హాజరయ్యారు.