గుంటూరు మేయర్ పీఠంపై బీజేపీ కన్ను ? మాజీ వైసీపీ నేతకు ఆఫర్..!
ఏపీలో ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు కాకరేపేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికార కూటమితో పాటు విపక్ష వైసీపీ కూడా ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అందులోనూ మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీకి రెండు పక్షాలూ సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కీలకమైన గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ (Guntur Mayor) పదవిని తీసుకునేందుకు కూటమి పార్టీ బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అంతే కాదు ఈ పదవికి ఓ వైసీపీ మాజీ నేతను కూడా రెడీ చేసుకుంటోంది.
కూటమి పార్టీల మధ్య ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకాలు జరగలేదు. త్వరలో మూడు పార్టీల నాయకులు భేటీ కాబోతున్నారు. ఆలోపే గుంటూరు మేయర్ సీటుపై కన్నేసిన బీజేపీ (BJP).. ఆ మేరకు లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గుంటూరు నగరంలోని పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో మాజీ మేయర్ , మాజీ వైసీపీ నేత కూడా అయిన కావటి మనోహర్ నాయుడిపై (Kavati Manohar Naidu) ఫోకస్ పెట్టింది. కావటితో ఇప్పటికే బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

కావటి మనోహర్ నాయుడు బీజేపీలో చేరేందుకు సై అంటే.. ఆయన్ను మేయర్ అభ్యర్ధిగా బరిలోకి దింపే యోచనలో బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా కావటి మనోహర్ నాయుడుకు గుర్తింపు ఉంది ఆర్థికంగా బలమైన నేత కూడా కావడంతో కావటిపై బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీ తరఫున గుంటూరు నగర మేయర్గా పనిచేసిన కావటి .. పార్టీ ఓటమి తర్వాత గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత ఏ పార్టీలో చేరకుండా సైలెంట్ గా ఉంటున్న ఆయన్ను బీజేపీలోకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కావటి అనుచరులు కూడా బీజేపీలో చేరేలా ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.














Click it and Unblock the Notifications