వివేకా కేసులో సీబీఐ దూకుడు- హత్యకు వాడిన ఆయుధాల గుర్తింపు-సునీల్ సమాచారంతో
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక సూత్రధారి సునీల్ యాదవ్ ను అరెస్ట్ చేసిన సీబీఐ.. ఆయన్ను కస్టడీలోకి కూడా తీసుకుంది. కస్టడీ విచారణలో సునీల్ చెప్పిన వివరాల ఆధారంగా వివేకా హత్యకు వాడిన ఆయుధాల్ని సీబీఐ గుర్తించింది. పులివెందులలోని రోటరీపురం వాగులోని ఇసుకలో వివేకా హత్యకు వాడిన ఆయుధాలు దాచిపెట్టినట్లు గుర్తించిన అధికారులు.. వాటిని వెలికి తీసే పనిలో ఉన్నారు.
వివేకా కేసుపై సీబీఐ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దాదాపు రెండు నెలలుగా చురుగ్గా దర్యాప్తు సాగిస్తున్న సీబీఐ అధికారులు తాజాగా నిందితుల్ని గుర్తించారు. వీరిలో ఈ హత్యకు ప్రధాన సూత్రధారి అయిన సునీల్ యాదవ్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చడమే కాకుండా రిమాండ్ నుంచి కస్టడీలోకి కూడా తీసుకున్నారు. దీంతో సునీల్ యాదవ్ ను ప్రశ్నించడం ద్వారా కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. ఈ సమాచారంతో వివేకా హత్య ఓ కొలిక్కి వస్తుందని సీబీఐ భావిస్తోంది.
హత్యపై కీలక వివరాలు చెప్పిన సునీల్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఎవరు చేశారు, ఎవరు చేయించారు, వారి వెనుక ఎవరున్నారు, వాడిన ఆయుధాలేంటి ? ఇలా పలు అంశాలపై సునీల్ యాదవ్ ను సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీబీఐ కస్టడీలోనే ఉన్న సునీల్ యాదవ్ ను పులివెందులలో పలుచోట్లకు తిప్పుతూ సీబీఐ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ వివరాలు కచ్చితంగా కేసును మలుపుతిప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముందుగా వివేకా హత్యకు వాడిన ఆయుధాల్ని తెలుసుకున్న అధికారులు వాటిని ఎక్కడ దాచారో కూడా వివరాలు సేకరించారు.
వాగు ఇసుకలో ఆయుధాలు ?
వివేకా హత్యకు వాడిన ఆయుధాల్ని పులివెందులలోనే దాచిపెట్టారని గుర్తించిన సీబీఐ అధికారులు సునీల్ యాదవ్ తో పాటు చింటూ అనే మరో వ్యక్తిని కూడా తీసుకుని పట్టణంలో కలియతిరుగుతున్నారు. స్ధానిక రోటరీనగర్ లోని వాగులోని ఇసుకలో వాటిని దాచి పెట్టినట్లు తెలుసుకున్నారు. ఇప్పుడు వాటిని బయటకు తీసేందుకు స్ధానిక వ్యక్తుల సాయంతో సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రోటరీపురం వంకలో నీటిని బయటకు తోడిస్తున్నట్లు తెలుస్తోంది. లోతైన ఇసుకలో ఆయుధాలు పాతిపెట్టినట్లు భావిస్తున్న సీబీఐ.. వాటిని వెలికితీస్తే ఈ కేసులో గొప్ప పురోగతి సాధించినట్లవుతుంది.
Recommended Video
త్వరలో తేలిపోనుందా ?
వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ చేస్తున్న దర్యాప్తు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరు వీఐపీలు మినహా మిగతా నిందితులందరినీ గుర్తించండంతో పాటు అరెస్టులకు సిద్దమవుతున్న సీబీఐ.. అంతకు ముందే పక్కా ఆధారాలు సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇవాళ ఆయుధాల్ని వెలికితీస్తోంది. మరణాయుధాల్ని బయటపెట్టాక వాటిని నిందితులు ఎక్కడ కొనుగోలు చేశారు, హత్య సమయంలో ఎవరెవరు వాటిని వాడారో తెలుసుకోనుంది. దీంతో దర్యాప్తులో కీలక దశ ముగిసినట్లవుతుందని భావిస్తున్నారు. ఈ లెక్కన డిసెంబర్ లోపే ఈ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలయ్యే అవకాశముంది. హై ప్రొఫైల్ కేసు కావడంతో ఈ ఛార్డిషీట్ పైనా ఉత్కంఠ కొనసాగుతోంది.